హైదరాబాద్ : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మరోసారి పెరుగుతున్నది. గంట గంటకు ప్రవాహం ఎక్కువవుతున్నది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గోదావరి నీటిమట్టం 41.2 అడుగులుగా ఉన్నది. ప్రస్తుతం నదిలో 8,56,949 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువతో పాటు పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నదిలోకి ప్రవాహం పెరుగుతున్నది.
గత నెలలో భద్రాచలం వద్ద గోదావరి రికార్డు స్థాయిలో వరద పోటెత్తిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 41.2 అడుగుల వద్ద ప్రవాహం కొనసాగుతుండగా.. 43 అడుగులకు నీటిమట్టం చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 48 అడుగులకు వరద చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ అవుతుంది. 53 అడుగుల దాటితే అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసి, రెడ్ అలెర్ట్ ప్రకటిస్తారు.