హైదరాబాద్ జూలై 14(నమస్తే తెలంగాణ): గోదావరిలో వరదనీరు ప్రమాదకరస్థాయికి చేరుకుంటున్నందున అన్ని ప్రభుత్వ విభాగాలు అప్రమత్తంగా ఉండి సహాయ చర్యలు ముమ్మరం చేసేలా అదనపు కంటింజెన్సీ ప్లాన్ రూపొందించాలని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ బీఆర్కే భవన్ నుంచి గురువారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా జిల్లాల్లో పరిస్థితిని సమీక్షించారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో భద్రాద్రి కొత్తగూడెం నుండి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, హైదరాబాద్ నుంచి డీజీపీ మహేందర్రెడ్డి, సంబంధిత సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రాణ నష్టాన్ని అరికట్టేందుకు ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలను ప్రత్యేక శిబిరాలకు తరలించాలన్నారు. జేసీబీలు, జనరేటర్లు, ఇసుక బస్తాలు, ఇతర సామగ్రిని వ్యూహాత్మక పాయింట్లలో ఉంచాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు.ఎలాంటి పరిస్థితినైనా ఎదురొనేందుకు అదనపు బలగాలతో పాటు పడవలు, లైఫ్ జాకెట్లు తదితర పరికరాలను జిల్లాలకు పంపుతున్నట్టు డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. ఈ టెలి కాన్ఫరెన్స్లో ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.