యాదగిరిగుట్ట, జనవరి 14 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయంలో శనివారం రాత్రి గోదాదేవి-రంగనాథస్వామి కల్యాణం కనుల పండువగా సాగింది. స్వామివారి ప్రధానాలయంలోని మొదటి ప్రాకార మండపంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కల్యాణతంతును వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు. ఆలయం తరఫున గోదాదేవికి పట్టువస్ర్తాలు సమర్పించారు. స్వామివారి ప్రసాదాన్ని ఈవో గీత.. సీఎస్ శాంతికుమారికి అందజేశారు. ఆమె వెంట వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు, ఆలయ ఆనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి తదితరులు ఉన్నారు.