కొల్లాపూర్, జూలై 17: కృష్ణానదిలో సప్తనదుల సంగమ ప్రదేశంలో కొలువైన పురాతన సంగమేశ్వరాలయ శిఖరాన్ని వరద జలాలు ఆదివారం తాకాయి. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని కృష్ణానది తీరంలోని సోమశిల గ్రామానికి ఎదురుగా (నది అవతలి వైపు) ఏపీలోని నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వరాలయ శిఖరం ఆదివారం రాత్రికి నీటిలో పూర్తిగా జలాధివాసం కానున్నది. దీంతో శివుడికి చివరి పూజగా భావించిన ఆలయ ప్రధానార్చకులు తెలకపల్లి రఘురామశర్మ నదికి ఎగువ నుంచి వరద ఉధృతి తీవ్రస్థాయిలో ప్రవహిస్తున్నా.. లెక్కచేయకుండా స్థానిక జాలర్ల సాయంతో మరబోటులో ఆలయ శిఖరానికి చేరుకొన్నారు. సంగమేశ్వరుడి శిఖరానికి పసుపు, కుంకుమ, పూలతో అలంకరించారు. ఆలయం పూర్తిగా మునిగితే గుర్తించేలా జాలర్లు ఆలయ శిఖరానికి కాషాయపు జెండాను కట్టి వచ్చారు.