హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాల్లో సాగు చేసే వరంగల్ చపాట రకం మిర్చికి భౌగోళిక గుర్తింపు (పేటెంట్) సాధించేందుకు శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే వర్సిటీ పరిధిలోని మహబూబాబాద్ జిల్లా మల్యాల్ జేవీఆర్ ఉద్యాన పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు ప్రాజెక్ట్ రిపోర్టు తయారుచేశారు.
గత పది నెలలుగా భౌగోళిక గుర్తింపు సాధించేందుకు అవసరమైన సాగు విధానాలు, దాని పుట్టుక, తెలుగులో ఎన్ని రకాలుగా పిలుస్తారు వంటి అంశాలపై అధ్యయనం చేస్తున్నారు. ఈ మిర్చిలోని పోషక విలువలను రాజేంద్రనగర్లోని క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్, రసాయనిక గుణాలను గుంటూరులోని స్పైస్బోర్డులో పరీక్ష చేయించారు. ఈ ప్రాజెక్టు 80 శాతం పూర్తయిందని, మరో రెండు నెలల్లో చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేయనున్నట్టు ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వీ నీరజా ప్రభాకర్ తెలిపారు. వరంగల్ చపాట మిర్చికి యూరప్, అమెరికా దేశాల్లో సైతం మంచి గిరాకీ ఉండటం విశేషం. ఈ మిర్చిని ఆహారశుద్ధి పరిశ్రమ, రెస్టారెంట్లు, బేవరేజెస్, పచ్చళ్ల తయారీలో అధికంగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్ రూ.23 వేల నుంచి రూ.25 వేలు పలుకుతున్నది.