హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): జలమండలికి ఈ ఏడాది అవార్డుల పంట పడుతున్నది. ఇప్పటికే మూడు పురస్కారాలు రాగా, మరో అవార్డు జలమండలి ఖాతాలో పడింది. ది ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్ (ఈఈఎఫ్) ఇచ్చే ‘గ్లోబల్ ఇన్నోవేషన్ ఇన్ వాటర్ టెక్నాలజీ అవార్డు -2023ను దక్కించుకున్నది. ఈ మేరకు జలమండలి ఎండీ దానకిశోర్కు ఈఈఎఫ్ ఫౌండేషన్ సీఈవో డాక్టర్ అనిల్ గార్గ్ సోమవారం లేఖ రాశారు.
ఈ నెల 25న ఢిల్లీలోని బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో అవార్డును ప్రదానం చేయనున్నారు. అవార్డు స్వీకరణతోపాటు పునరుత్పాదక శక్తి, నీరు, వ్యర్థాల నుంచి సంపద సృష్టించడం అంశాలపై జరిగే అంతర్జాతీయ కాన్ఫరెన్స్లో పాల్గొనాలని సంస్థ ప్రతినిధులు ఎండీని కోరారు. తాగునీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణలో నూతన సాంకేతికత విధానాలు రూపొందించుకోవడంతోపాటు ఐటీ, రెవెన్యూ పరంగా సైతం కొత్త టెక్నాలజీని జోడిస్తూ అమలు చేస్తున్నందుకు అవార్డుకు ఎంపికైంది.