హైదరాబాద్ : విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యని అభ్యసించాలనుకునే విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో నేరుగా సంప్రదింపులు జరిపేందుకు టీ హబ్ సహకారంతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఫారిన్ స్టడీస్ (ఐఎంఎఫ్ఎస్) ‘గ్లోబల్ ఎడ్యుఫెస్ట్ 2023’ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 10వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు.
అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లాండ్ తదితర దేశాలకు చెందిన 100కు పైగా విదేశీ విశ్వవిద్యాలయాలకు చెందిన 60 మందికి పైగా ప్రతినిధులు ఒక రోజు పాటు జరిగే ఈ సదస్సులో పాల్గొంటారు. స్టూడెంట్ లోన్స్ అందించే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ప్రిపరేషన్ టెస్ట్ ఏజెన్సీలైన ఈటీఎస్, పీటీఈ, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఫారెక్స్ రెమిటర్టు వంటి వివిధ భాగస్వాములు హాజరై విద్యార్థులకు ఒక సంపూర్ణమైన అనుభవాన్ని అందించనున్నారు. యూఎస్ కాన్సులేట్కు చెందిన కాన్సులర్, అధికారులు యూఎస్ఏ స్టడీ, యూఎస్ వీసా ప్రాసెస్ గురించి సెమినార్ నిర్వహిస్తారు.
ముఖ్య అతిథులుగా ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, టీ హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాసరావు, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది వి.పట్టాభి హాజరుకానున్నారు.