దిగుమతులకు క్యూబా సహా నాలుగు దేశాలు రెడీ
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కంపెనీలతో ఒప్పందాలు
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో తయారవుతున్న వైద్య పరికరాలకు విదేశాల్లోనూ గిరాకీ పెరుగుతున్నది. వీటిని దిగుమతి చేసుకొనేందుకు పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా ప్రపంచంలోనే అత్యంత పటిష్ఠమైన ప్రజారోగ్య వ్యవస్థను కలిగి ఉన్న క్యూబాతోపాటు ఘనా, నమీబియా, ఈక్వెడార్ మన వైద్య పరికరాలను దిగుమతి చేసుకొనేందుకు ముందుకొచ్చాయి. ఈ మేరకు శనివారం ఆ నాలుగు దేశాల ట్రేడ్ కమిషనర్లు మన రాష్ట్రంలోని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొన్నారు. భారత్లో ఘనా హైకమిషనర్ క్వాకు అసోమా చెరెమెహ్తోపాటు ఆ దేశ రాజకీయ, ఆర్థిక వ్యవహారాల మంత్రి ఎర్నెస్ట్ నానా అడ్జీల నేతృత్వంలోని ఆఫ్రికా దేశాల ట్రేడ్ కమిషనర్ల బృందం శనివారం సుల్తాన్పూర్లోని మెడికల్ డివైజెస్ పార్కును సందర్శించి, మెడికల్ డివైజెస్ పార్క్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమైంది.
వివిధ రకాల శస్త్రచికిత్సల్లో ఉపయోగించే వైద్య పరికరాలు, కంటి వైద్యానికి సంబంధించిన పరికరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వారు నోవాటెల్లో ఆకృతి ఆప్థాల్మిక్, ఫోర్సైట్ ఐ కేర్, సిద్ధి నాగార్జున ఆయుర్వేద ఫార్మసీ, మెడ్ఆక్ తదితర సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందంలో భాగంగా ఘనాలో అక్కడి ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న 10 దవాఖానలతోపాటు మిగిలిన మూడు దేశాల్లోని దవాఖానలకు అవసరమైన వైద్య పరికరాలను తెలంగాణ నుంచి ఎగుమతి చేయనున్నారు. సమావేశంలో ఇండియా-ఆఫ్రికా ట్రేడ్ కౌన్సిల్ సభ్యులతోపాటు పలు ఇతర దేశాల ట్రేడ్ కమిషనర్లు, రాష్ట్ర ఎంఎస్ఎంఈ రంగ అధికారులు కూడా పాల్గొన్నారు.
మెడికల్ డివైజెస్ తయారీలో అగ్రగామిగా..
సుల్తాన్పూర్లో సుమారు 302 ఎకరాల్లో విస్తరించి ఉన్న మెడికల్ డివైజెస్ పార్కును రాష్ట్ర ప్రభుత్వం 2017లో ఏర్పాటు చేసింది. హెల్త్కేర్, ఫార్మా, లైఫ్సైన్సెస్ రంగాలతోపాటు వైద్యపరికరాల తయారీలో సైతం తెలంగాణను అగ్రగామిగా నిలపాలన్న సంకల్పంతో ఈ పార్కును నెలకొల్పింది. దీనిలో 50 కంపెనీలకు భూములు కేటాయించగా.. ఇప్పటికే పదికిపైగా కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్లో మంత్రి కేటీఆర్ ఇక్కడ పలు కంపెనీలను ప్రారంభించారు. గుండె శస్త్రచికిత్సకు ఉపయోగించే స్టెంట్లు కూడా ఇక్కడ తయారవుతుండటం విశేషం.