Kanti Velugu | హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కంటివెలుగు పరీక్షల సంఖ్య కోటిన్నర దాటింది. 100 రోజుల్లో కోటిన్నర మందికి కంటి పరీక్షలు చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పిస్తే, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో కేవలం 80 రోజుల్లోనే కోటిన్నర మార్కును దాటి, రికార్డు సృష్టించారు. బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 1.52 కోట్ల మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 71.71 లక్షల మంది పురుషులు, 80.71 లక్షల మంది మహిళలు ఉన్నారు. 9,959 మంది ట్రాన్స్జెండర్లు సైతం ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. కోటిన్నర మందిలో 25.60% మందికి కంటి సమస్యలు ఉన్నట్టు గుర్తించారు.
39 లక్షల మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. అవసరమైన వారికి మందులు ఇచ్చారు. పట్ణణాల్లో పరీక్షలు పూర్తి: కంటివెలుగు శిబిరాలు పట్టణ ప్రాంతాల్లో దాదాపు పూర్తయ్యాయి. మొత్తం 3,788 వార్డుల్లో శిబిరాలు నిర్వహించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటివరకు 3,443 పట్టణ వార్డుల్లో శిబిరాలు పూర్తయ్యాయి. మరో 281 వార్డుల్లో పురోగతిలో ఉన్నాయి. అంటే లక్ష్యంలో 99% పూర్తయినట్టే. గ్రామాల్లోనూ సుమారు 95% పూర్తయినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 12,763 గ్రామాల్లో క్యాంపులు నిర్వహించాలని లక్ష్యంగా నిర్ణయించున్నారు. ఇప్పటివరకు 11,634 గ్రామాల్లో పూర్తికాగా, 592 గ్రామాల్లో తుదిదశలో ఉన్నాయి.