Andhra Pradesh | హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి గాజుగ్లాసు గండం పొంచి ఉన్నది. జనసేన పార్టీ గాజుగ్లాసు గుర్తు చాలా చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి, జనసేనకు 21 అసెంబ్లీ, రెండు లోక్సభ స్థానాలు కేటాయించారు. ఈ పార్టీ సింబల్ గాజు గ్లాస్ గుర్తు టీడీపీ, బీజేపీ అభ్యర్థులు ఉన్న దాదాపు 50 నుంచి 70 నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం కేటాయించింది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి జనసేనకు గుర్తింపు లేకపోవడంతో ఆ పార్టీ గుర్తు ఫ్రీ సింబల్ జాబితాలోకి వెళ్లింది.
స్వతంత్ర అభ్యర్థులు కోరితే వారికి ఆ సింబల్ను కేటాయించే అవకాశం ఉండటంతో వివిధ పార్టీల నుంచి రెబల్ అభ్యర్థులుగా, స్వతంత్రులుగా పోటీ చేసిన వారు గాజు గ్లాసు గుర్తుకు ప్రాధాన్యం ఇచ్చారు. స్వతంత్ర అభ్యర్థుల్లో మెజార్టీ గాజుగ్లాసు గుర్తును పొందడటంతో టీడీపీ, బీజేపీ అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జనసేన అభ్యర్థి అనుకొని స్వతంత్ర అభ్యర్థికి ఓట్లు వేస్తే విజయసమీకరణాలు మారుతాయని కూటమి నేతలు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటివరకు ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు విజయవాడ పార్లమెంటుతోపాటు గాజువాక, విజయనగరం, భీమిలీ, మదనపల్లి, మైదుకూరు, జగ్గయ్యపేట, మచిలీపట్నం అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించినట్టు తెలిసింది.