హైదరాబాద్, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఎర చూపించిన కేసులో సీబీఐ దర్యాప్తును అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటు హైకోర్టు.. అటు సుప్రీంకోర్టుల్లో ఒకేసారి ప్రయత్నం చేసింది. న్యాయపరమైన తప్పిదాలు లేకుండా ఒకేసారి రెండు చోట్లా ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. సీబీఐ దర్యాప్తునకు అనుమతిస్తూ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు అమలును తక్షణమే నిలుపుదల చేయాలని మంగళవారం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేజీ పార్థివాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఎదుట ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే ప్రత్యేకంగా ప్రస్తావించారు.
హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనను డివిజన్ బెంచ్ తోసిపుచ్చిందని, కనీసం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసే వరకు సీబీఐ దర్యాప్తు చేపట్టకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరినా అంగీకరించలేదని వివరించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అనేక కీలక విషయాలను సేకరించిందని, ఈ దశలో సీబీఐ దర్యాప్తు చేపడితే కీలక ఆధారాలు ధ్వంసమయ్యే ప్రమాదం ఉంటుందని, ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు వృథా అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సుప్రీంకోర్టు సీజే బెంచ్ స్పందిస్తూ.. ఇదే అంశాన్ని బుధవారం ఉదయం ప్రస్తావించాలని సూచించింది. ఒకవేళ ప్రస్తావన చేయకపోయినప్పటికీ వచ్చే వారం రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్పై విచారణ చేపడతామని ప్రకటించింది.
హైకోర్టులో అనుబంధ పిటిషన్
ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంపై హైకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి ఎదుట విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం కూడా సీబీఐ దర్యాప్తు విషయంలో తీర్పు వెలువరించిన నేపథ్యంలో అనుబంధ పిటిషన్ను సింగిల్ జడ్జి వద్ద దాఖలు చేసే అంశంపై సాంకేతిక వివరణను సీజే నుంచి తీసుకోవాలని న్యాయమూర్తి ప్రభుత్వానికి సూచించారు. సీబీఐ దర్యాప్తు ప్రారంభించిందా? సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ స్పందిస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించే వరకు కనీసం వారం పాటు సీబీఐ దర్యాప్తు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
మొయినాబాద్ ఫాంహౌస్లో ఎమ్మెల్యేలు బీజేపీలో చేరితే కోట్ల రూపాయలు ఇస్తామని రామచంద్రభారతి, ఇతర నిందితులు ప్రలోభపెట్టారనే కేసును సిట్ లోతుగా దర్యాప్తు చేస్తున్నదని, పలు కీలక ఆధారాలు సేకరించిందని వివరించారు. కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలన్న ప్రభుత్వ అప్పీల్ పిటిషన్కు విచారణార్హత లేదని సీజే నేతృత్వంలోని డివిజన్ బెంచ్ వెలువరించిన తీర్పు అమలును మూడు వారాలపాటు నిలిపివేయాలని కోరుతూ రాజేంద్రనగర్ ఏసీపీ బీ గంగాధర్ అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. సింగిల్ జడ్జి తీర్పులోని న్యాయపరమైన అంశాల్లోకి వెళ్లకుండానే డివిజన్ బెంచ్ అప్పీళ్లను డిస్మిస్ చేసిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లే వరకు అయినా తీర్పు అమలును రెండు వారాలపాటు నిలిపివేయాలని కోరినా ధర్మాసనం అనుమతించలేదని తెలిపారు.
అప్పీళ్లను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసిన వెంటనే ఫైళ్లు అప్పగించాలని సీబీఐ ఒత్తిడి చేయడం మొదలు పెట్టిందని పేర్కొన్నారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖలు రాశారని తెలిపారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. అప్పీళ్ల విచారణ సమయంలో డివిజన్ బెంచ్ స్టే ఇచ్చిందా? అని అడిగారు. అప్పీళ్లపై విచారణ ముగిసే వరకు ఫైళ్ల గురించి ఒత్తిడి చేయరాదని మౌఖికంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని, తీర్పు నేపథ్యంలో అవి రద్దయ్యాయని ఏజీ జవాబు చెప్పారు. ఫైళ్లు అప్పగించాలని సీబీఐ అత్యుత్సాహం చూపుతున్నదని, దీనిని హైకోర్టు అర్థం చేసుకుని కనీసం వారం పాటైనా తీర్పు అమలును నిలిపివేయాలని ఏజీ కోరారు. సిట్ దర్యాప్తు చేయనప్పటికీ సీబీఐ మాత్రం అత్యుత్సాహం చూపడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. సుప్రీంకోర్టులో ఏ ఉత్తర్వులు వెలువడినా అందుకు అందరూ కట్టబడి ఉండాలని, అప్పటివరకు ఆగేందుకు సీబీఐ ఓపిక పట్టడం లేదని ఏజీ చెప్పారు. దీనిపై నిందితులు, బీజేపీ తరఫు సీనియర్ న్యాయవాదులు ఎల్ రవిచందర్, జే ప్రభాకర్, మయూర్రెడ్డి ప్రతివాదన చేస్తూ.. డివిజన్ బెంచ్ అప్పీళ్లకు విచారణార్హత లేదని తేల్చిన తర్వాత స్టే కోసం సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ దాఖలు చేయడం చెల్లదని పేర్కొన్నారు.
ఇదే సింగిల్ జడ్జి డిసెంబర్ 26న తీర్పు చెప్పారని, డివిజన్ బెంచ్ తీర్పు తర్వాత స్టే ఇవ్వలేదని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు స్టే ఇస్తే.. సిట్ నుంచి స్వాధీనం చేసుకున్న ఫైళ్లను తిరిగి సీబీఐ నుంచి స్వాధీనం చేసుకోవచ్చునని చెప్పారు. సీబీఐ తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ జీ ప్రవీణ్కుమార్ వాదిస్తూ.. సిట్ ఫైళ్లు అప్పిగించాలని సీబీఐ ఐదు లేఖలు రాసినా స్పందన లేదని చెప్పారు. వాదనల తర్వాత న్యాయమూర్తి స్పందిస్తూ.. సింగిల్ జడ్జి తీర్పుపై డివిజన్ బెంచ్ వద్ద అప్పీల్లో తుది ఉత్తర్వులు వెలువడ్డాక ఇప్పుడు అదే కేసులో స్టే ఇవ్వాలని సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ వేయవచ్చునా? దీనిపై ప్రధాన న్యాయమూర్తిని అడిగి చెప్పాలని ఏజీని కోరారు. విచారణను బుధవారానికి వాయిదా వేస్తామని, ఈలోగా సీజే నుంచి సాంకేతిక అంశంపై స్పష్టత తీసుకుని చెప్పాలని కోరారు.