హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): విశ్రాంత ఉద్యోగికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) నుంచి పింఛన్ అందించాలని పీఎఫ్ కమిషనర్ను హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. హైదరాబాద్ మణికొండకు చెందిన బొంతపల్లి రమేశ్ 1985లో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్లో ఉద్యోగిగా చేరి 2017లో డిప్యుటేషన్పై హైదరాబాద్ వచ్చారు. 2019లో రిటైరయ్యారు. ప్రతినెలా ఆయన జీతం నుంచి రూ.1250 కట్ అయ్యేది.
ఉద్యోగ విరమణ తర్వాత పింఛన్ కోసం ఈపీఎఫ్ అధికారులను సంప్రదించగా స్పందించలేదు. చేసేది లేక ఆయన వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన కమిషన్ రూ.5వేల నష్టపరిహారంతోపాటు రూ.3వేలు కోర్టు ఖర్చులను అందజేయాలని పేర్కొన్నది. అలాగే ఫారం 10డీ ప్రకారం 45 రోజుల్లోగా పింఛన్ ఇవ్వాలని సూచించింది.