హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఐజీఎస్టీ నిధుల్లో తెలంగాణకు రావాల్సిన రూ.210 కోట్లను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్రావు.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్కు విజ్ఞప్తిచేశారు. పత్తి పరిశ్రమకు శరాఘాతంగా మారిన ఆర్సీఎంను రద్దు చేయాలని కోరారు. లక్నోలో శుక్రవారం నిర్వహించిన 45వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి మంత్రి హరీశ్రావు హాజరయ్యారు. అనంతరం రాష్ర్టానికి రావాల్సిన పెండింగ్ నిధులతోపాటు, పలు విషయాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. 2018-19 ఏడాదికి సంబంధించి ఐజీఎస్టీ కింద కేంద్రం ఖాతాలో రాష్ట్రం రూ.13,944 కోట్లు జమ చేసిందని, అందులో రాష్ర్టానికి వాటాగా రూ.352 కోట్లు రావాల్సి ఉన్నదని వివరించారు. ఇప్పటివరకు రూ.142 కోట్లు మాత్రమే విడులయ్యాయని, మిగిలిన రూ.210 కోట్ల నిధులను సత్వరమే విడుదల చేయాలని కోరారు.
వెనుకబడిన ప్రాంతాలకు నిధులివ్వండి
ఏపీ పునర్విభజన చట్టంలోని 94 (2) సెక్షన్ ప్రకారం హైదరాబాద్ మినహా మిగిలిన ఉమ్మడి 9 జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ.50 కోట్ల చొప్పున 2019-20 సంవత్సరానికి రూ.450 కోట్లను వెంటనే విడుదల చేయాలని హరీశ్రావు విజ్ఞప్తిచేశారు. పరిపాలనా సౌలభ్యంలో భాగంగా రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 10 నుంచి 33కు పెరిగిందని.. ఈ నేపథ్యంలో వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సహకారాన్ని 2021-22 నుంచి మరో ఐదేండ్లపాటు కొనసాగించాలని కోరారు. 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల మేరకు రాష్ర్టానికి ప్రత్యేక గ్రాంటు కింద రావాల్సిన రూ.723 కోట్లు కూడా వెంటనే విడుదల చేయాలని విన్నవించారు.
పత్తిపై ఆర్సీఎంను రద్దు చేయండి
పత్తిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంతో వస్త్ర పరిశ్రమ తీవ్ర ఒడిదొడుకులకు గురవుతున్నదని మంత్రి హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో పత్తిపై విధిస్తున్న రివర్స్ చార్జ్ మెకానిజం (ఆర్సీఎం)ను వెంటనే రద్దు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. పత్తిని అధికంగా పండించే మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఫిట్మెంట్ కమిటీ ద్వారా అభిప్రాయం సేకరించి, సమస్యలను పరిష్కరించాలని అభ్యర్థించారు. మంత్రి హరీశ్రావు విన్నవించిన ఆయా అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని నిర్మలా సీతారామన్ హామీఇచ్చారు. అనంతరం రాష్ట్ర రెవెన్యూ లోటును ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు కేంద్రమంత్రికి వివరించారు.