హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): అక్షరధామ్, లోటస్ టెంపుల్ మాదిరిగా తాను త్వరలో అంతర్జాతీయస్థాయిలో నిర్మించబోయే ‘వేద విద్యా సెంటర్’కు రూ.20 కోట్లు విరాళం ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డికి మాజీ డీఎస్పీ నళిని ఆచార్య విన్నవించారు. ఉద్యోగానికి బదులుగా తాను ఏర్పాటు చేయబోయే వేద విద్యా సెంటర్కు నిధులు ఇవ్వాలని కోరారు. శనివారం ఆమె సచివాలయంలో సీఎంని కలిసి పలు విషయాలపై చర్చించారు. రెండేండ్లుగా ఆర్య జగత్తులో ప్రత్యేక గుర్తింపును, గౌరవాన్ని పొందుతున్నానని చెప్పారు.
దయానంద సరస్వతికి తాను పూర్ణ సమర్పితురాలైయ్యానని, ఆయన చూపిన శ్రేయోమార్గంలో భారతీయ సంస్కృతి పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం డీఎన్ఏ పేరిట వాట్సాప్ గ్రూప్లు, మూడు భాషల్లో యూట్యూబ్ చానల్స్ నిర్వహిస్తున్నట్టు వివరించారు. సామాన్యులకు అర్థమయ్యేలా ఆర్ష గ్రంథాలను రాస్తున్నానని తెలిపారు. వేదం, యజ్ఞం గురించి దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి వేద విద్యాసెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇటీవల తన గురించి వాకబు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సహృదయంతో వేద విద్యాకేంద్రానికి ఆర్థిక సాయం చేయాలని కోరారు. నాటి ఉద్యమాన్ని గుర్తు చేసి కొండంత వేదన తీర్చారని పేర్కొన్నారు.
మళ్లీ డీఎస్పీగా చేరాలని తనను ఎవరూ అడగలేదని, తానే ఆ ఉద్యోగాన్ని వద్దనుకొని ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెట్టినట్టు మాజీ డీఎస్పీ నళిని ఆచార్య తెలిపారు. కాగా నాడు ఉద్యమ సమయంలో జరిగిన కొన్ని అంశాలపై తన సర్వీస్ బుక్కు సంబంధించి సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. నాడు జరిగిన విషయాలపై ఎంక్వయిరీ కమిటీ వేసి, యాక్షన్ తీసుకోవాలని కోరినట్టు వెల్లడించారు. ఓ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లో ఇప్పటి వరకు తనకు గుర్తున్న విషయాలను రాసి సీఎంకు ఇచ్చానని వివరించారు. తనలా మరో ఆఫీసర్ ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో సీఎంకు పలు విషయాలు విన్నవించానని తెలిపారు.