హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ నెల 5న కాలేజీకి వచ్చిన ఆ విద్యార్థిని ఐదో అంతస్థుపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. పత్రికల్లో వచ్చిన ఈ ఘటనను ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది.
కూకట్పల్లికి చెందిన ఆ విద్యార్థిని మూడు నెలల క్రితమే కాలేజీలో చేరిందని, రోజూ బస్సులో ప్రయాణిస్తుందని వార్తా కథనాలు పేర్కొన్నాయి. విద్యార్థిని మృతిపై పత్రికల్లో వచ్చిన కథనాలు నిజమే అయితే అది తీవ్ర ఆందోళనకరమైన అంశమని, మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. ఆ ఘటనపై నాలుగువారాల్లోగా తమకు నివేదిక అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి ఇచ్చిన నోటీసుల్లో ఆదేశించింది. ఆత్మహత్య ఘటనపై పోలీసుల దర్యాప్తు, కాలేజీ యాజమాన్యం జరిపిన విచారణలో వెల్లడైన అంశాలను ఆ నివేదికలో పేర్కొనాలని సూచించింది.