హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రవేశపెట్టిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. అభాగ్యులకు అండగా నిలిచేందుకు మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఎంతో మంది మంచి మనసుతో ముందుకొస్తున్నారు. తాజాగా గిఫ్ట్ ఏ స్మైల్ చాలెంజ్లో భాగంగా మరొక విద్యార్థిని సహాయం పొందింది.
ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మిత్రుడు వంగ రాజేశ్వర్ రెడ్డి మంగళవారం బధిర విద్యార్థిని అర్చనకు మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన అర్చన 9 వ తరగతి చదువుతుంది. చదువులో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న అర్చన పుట్టుకతో బధిరురాలు.
ఆమెకు అవసరమైన ఇయరింగ్ మిషన్ కోసం అవసరమైన నిధులను అందించేందుకు సిద్దిపేటకు చెందిన రాజేశ్వర్రెడ్డి ముందుకు వచ్చారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రగతి భవన్లో అర్చనకు మూడు లక్షల రూపాయల చెక్కును అందించారు. అర్చనకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన రాజేశ్వర్ రెడ్డిని మంత్రి కేటీఆర్ అభినందించారు.