నిజామాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు సర్కారు దవాఖానలను బలోపేతం చేస్తూ ప్రజలకు కార్పొరేట్ తరహా వైద్యం అందించేందుకు కృషి చేస్తుంటే కొందరు పనిగట్టుకొని బదనాం చేస్తున్నారు. సర్కారు వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరుగుతున్నవేళ కావాలని బట్టకాల్చి మీద వేస్తున్నారు. ఫుల్లుగా మద్యంతాగి ఉన్న వ్యక్తిని వీల్ చైర్ వచ్చేదాకా ఆగకుండా అతడి కుటుంబ సభ్యులే లిఫ్ట్లోకి లాక్కెళ్తుండగా ఓ వ్యక్తి తీసిన వీడియోను చూపుతూ రాష్ట్రంలోని వైద్య వ్యవస్థనే అప్రతిష్ఠపాలు చేసేలా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి.
కొంతమంది మరో అడుగు ముందుకేసి చనిపోయిన వ్యక్తిని లాక్కెళ్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు చూపుతూ మసిపూసి మారేడుగాయ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై నిజామాబాద్ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ శనివారం తీవ్రంగా స్పందించారు. రోగిని సిబ్బంది జాగ్రత్తగా వీల్చైర్లో తీసుకెళ్లి వెయిటింగ్ హాల్లో కూర్చోబెడుతున్న సీసీ టీవీ ఫుటేజీని విడుదల చేశారు. నిజామాబాద్ జీజీహెచ్పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతోసహా ఆమె తిప్పికొట్టారు.
వీడియో అసంబద్ధం
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖాన ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో అసంబద్ధమైనదని డాక్టర్ ప్రతిమారాజ్ వెల్లడించారు. అందులో రోగి బతికే ఉన్నాడని, కొందరు చనిపోయిన వ్యక్తిని లాక్కెళ్తున్నారని ఇష్టమొచ్చినట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటన జరిగి 15 రోజులు దాటిందని, తమ అంతర్గత విచారణ ప్రకారం రోగి పేరు హన్మాండ్లుగా గుర్తించామని చెప్పారు. మార్చి 31న రాత్రి అతడు మద్యం మత్తులో జీజీహెచ్కు రాగా, అత్యవసర విభాగంలో చికిత్స అందించినట్టు తెలిపారు. మద్యానికి బానిసగా మారడంతోనే బంధువులు అతడిని దవాఖానకు తీసుకొచ్చారని చెప్పారు. జీజీహెచ్లోని డీ-అడిక్షన్ సెంటర్లో చేర్పించుకొని చికిత్స చేస్తామని చెప్పడంతో వారు ఆలోచించి చెప్తామన్నారని తెలిపారు.
అనంతరం రోగిని వైద్య సిబ్బంది వీల్ చైర్లోనే వెయిటింగ్ రూంకు తీసుకెళ్లారని, పింక్ డ్రెస్ కోడ్లో ఉన్న వెంకట్ రోగికి సపర్యలు చేశాడని వెల్లడించారు. తాగిన మైకంలో నిలబడలేని స్థితిలో ఉన్న వ్యక్తిని వెయిటింగ్ హాలులో స్వయంగా కూర్చోబెట్టాడని చెప్పారు. మరుసటి రోజు ఉదయం మద్యం మత్తులో ఉన్న హన్మాండ్లును అతడి కుటుంబ సభ్యులు ఓపీ చిట్టీ తీసుకొని రెండో అంతస్థులో ఉన్న వైద్యుడిని సంప్రదించేందుకు వెళ్లాల్సి ఉండగా, పేషెంట్ కేర్ సిబ్బంది వీల్ చైర్ తీసుకొచ్చేలోపే కుటుంబ సభ్యులు రోగిని లిఫ్ట్లోకి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని తెలిపారు. ఈ ఘటనను ఒకరు కావాలని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టినట్టు చెప్పారు.
22 సెకన్ల తర్వాత ఏం జరిగిందో వీడియోలో చూపించడం లేదని, దవాఖానపై బురద జల్లేందుకే కుట్ర పన్నినట్టుగా తెలుస్తున్నదని మండిపడ్డారు. వీడియో తీసిన వ్యక్తికి మానవత్వం ఉండి ఉంటే.. రోగికి సేవ చేసి ఉండాలని లేదా దవాఖాన సిబ్బందికి సమాచారమైనా ఇచ్చి ఉండాలని అన్నారు. కావాలని వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టాడని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. వీడియో తీసిన వ్యక్తిని గుర్తించి, పట్టుకొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. జీజీహెచ్లోని అన్ని అంతస్థుల్లో 57 స్ట్రెచర్లు, 51 వీల్ చైర్లు అందుబాటులో ఉన్నాయని, మరో 41 వీల్ చైర్లు స్టోర్ రూంలో ఉన్నాయని వివరించారు. మొత్తం ఏడు అంతస్థుల్లో వీల్ చైర్లు ఎక్కడైనా వదిలేస్తే సులువుగా ఆయా విభాగాలకు చేరేలా కలర్ కోడ్ ఇచ్చామని పేర్కొన్నారు.
ఫుల్లుగా తాగి ఉన్నాడు..
హన్మాండ్లు అనే వ్యక్తిని మార్చి 31న నేనే ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లా. అక్కడినుంచి వెయిటింగ్ హాలుకు తీసుకొచ్చా. ఫుల్లుగా మద్యం తాగి ఉన్నాడు. అతడితోపాటు ఇద్దరు మహిళలు ఉండటం వల్ల నేనే కుర్చీలో కూర్చోబెట్టా. హన్మాండ్లు..బంధువుల మాట వినకపోవడంతో నేనే సముదాయించిన. మహిళలకు జాగ్రత్తలు చెప్పి వేరే పేషెంట్ను తీసుకెళ్లేందుకు వెళ్లా. దవాఖానలో పేషెంట్ కేర్ టేకర్లు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. మాకు చెప్తే ఎప్పుడైనా ఎక్కడైనా తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంటాం.
– వెంకట్, పేషెంట్ కేర్టేకర్