మనోడైతే ఏంచేసినా మంచిగనే ఉంటది. కానోడైతే చాలు.. కండ్ల ముందు కనిపిస్తున్నా సరే.. మేకను కూడా కుక్క అని ముద్ర వేయాలి. దేశంలో బీజేపీ నేతలు చేస్తున్న పనులన్నీ ఇట్లనే ఉంటయి. నోటికి ఏదొస్తే అదే మాట్లాడతరు. చేతికెంతొస్తే అంత బురద చల్లుతరు. రోజుకో నేత కేంద్రం నుంచి దిగొస్తరు. వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రాయి విసిరిపోతరు. పూటకోమాట.. రోజుకో ఆరోపణ.. విచిత్రమేమింటే.. వీళ్లే.. పార్లమెంట్ దగ్గరకు వచ్చేసరికి.. అద్భుతం.. అమోఘం.. అవినీతి లేదు.. ఏం లేదు.. అని చట్ట సభల్లో ఊదరగొడతరు. హైదరాబాద్కు వచ్చి మీడియా ముందు మాత్రం అడ్డగోలుగా మాట్లాడతరు. ప్రతి మాటా కుటిలమే. ప్రజలను మభ్యపెట్టాలి.. గాయిగత్తర చేయాలి.. అయోమయానికి గురిచేయాలి. తాము చేసిన ఆరోపణ అబద్ధమని తేలేసరికి మరో డ్రామా మొదలుపెట్టాలి. ఇప్పుడు బీజేపీ నేతలు తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టుపై పడ్డరు. ప్రాజెక్టు కట్టిందాని కంటే మించి అవినీతి జరిగిందని మొత్తుకొంటున్నరు. వాళ్లు పాలిస్తున్న చోట కమీషన్ ఇస్తే చాలు.. కాంట్రాక్టర్కు ఉత్తి పుణ్యానికి పైసలిచ్చేస్తరు. అవినీతి వాసనే వీళ్లకు కనపడదు.
-స్పెషల్ టాస్క్ బ్యూరో
ఏది అవినీతి?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకొన్నదే నీళ్లకోసం.. స్వరాష్ట్రంలో స్వపరిపాలన మొదలైన తరువాత ప్రధానంగా దృష్టి సారించింది సాగునీటి ప్రాజెక్టులపైన. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయడంతోపాటు.. మహా ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 70 వేల ఎకరాల్లో ఏడు లింకులు.. 28 ప్యాకేజీలతో రూపుదిద్దుకొన్న ఆసియాలోనే అతి పెద్దదైన ఈ బహుళ దశల ఎత్తిపోతల.. మూడు బరాజ్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు.. 1,531 కిలోమీటర్ల కాలువలు.. 15 రిజర్వాయర్లు, 22 పంప్హౌజ్లు, 17 సబ్స్టేషన్లు, 22 లిఫ్టులతో నిర్మాణమైంది.
జలాశయాల సామర్థ్యం 141 టీఎంసీలు.. భారతదేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో కేవలం 24 మాసాల్లో నిర్మితమైన మహాద్భుత ప్రాజెక్టు ఇది. ప్రపంచం మొత్తానికి ఈ ప్రాజెక్టు అపూర్వంగా కనిపిస్తుంది. ఎక్కడెక్కడినుంచో వచ్చి ఈ ప్రాజెక్టుపై డాక్యుమెంటరీలు రూపొందిస్తారు. కానీ.. మన ఢిల్లీ ఏలికలకు మాత్రం పచ్చకామెర్లు అంటుకొన్నయి. ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తారు. విచిత్రమేమంటే.. ప్రాజెక్టు నిర్మాణానికి అయిన ఖర్చు కంటే మించి అవినీతి అయిందని మాట్లాడటం ప్రపంచంలోనే వింత ఆరోపణ. అదికూడా సాక్షాత్తూ దేశ ఆర్థిక వ్యవస్థనంతా నియంత్రించే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వంటి నాయకులు అత్యంత బాధ్యతారాహిత్యంగా చేసే విమర్శ ఇది.
మీ అవినీతి మాటేమిటి?
బీజేపీ నేతలంతా గురివింద గింజలు. వాళ్ల మరకలు వాళ్లకు కనిపించవు. ఇందుకు ఉదాహరణ కర్ణాటకలో అక్కడి ప్రభుత్వ నిర్వాకం. అక్కడి ముఖ్యమంత్రి, మంత్రులు 40% కమిషన్ పేరుతో ఇప్పటికే చాలా చాలా పేరు తెచ్చుకొన్నారు. తెలంగాణలో కాళేశ్వరం వంటి మహా మహా ప్రాజెక్టుతో సరిపోల్చదగింది కానప్పటికీ.. అక్కడ ఒక చిన్న రోడ్డు పని గురించి తెలుసుకొంటేనే ఆశ్చర్యమేస్తుంది. బెంగళూరు మహానగర పాలిక ఆ నగరంలోని 73 వ వార్డులో ఏడు రోడ్లను మెరుగు పర్చడానికి రూ.1.7 కోట్లు మంజూరుచేసింది.
ఇందుకు సంబంధించి కాంట్రాక్టు పొందిన కాంట్రాక్టర్.. ఆ రోడ్లను బాగుచేయడం మాట దేవుడెరుగు.. తట్టెడు డాంబర్ కూడా తెచ్చి పోయలేదు. నకిలీ బిల్లులు, నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ ఫొటోలు చూపించి మొత్తం రూ.1.7 కోట్లు తీసేసుకొన్నారు. కర్ణాటక మంత్రి మునిరత్నం నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజరాజేశ్వర నగర పరిధిలో రెండుకోట్లు.. అంతకంటే తక్కువ అంచనా వ్యయంతో చేపట్టిన 116 పనుల్లో ఏకంగా 57 చోట్ల ఆవగింజంత పని కూడా కాకుండానే బిల్లులు విడుదలైపోయాయి. ఫిక్స్డ్ పర్సెంటేజ్ సీఎం ఉన్నచోట ఈ మాత్రం అవినీతి కామన్ అంటే ఏం చేయగలం? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మకు ఇవేవీ అస్సలు కనిపించడంలేదు.