హైదరాబాద్: సూడాన్లో (Sudan) చిక్కుకున్న తెలంగాణ పౌరులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆపరేషన్ కావేరీలో (Operation Kaveri) భాగంగా భారత్కు తిరిగి వస్తున్న వారిలో తెలంగాణ (Telangana) ప్రజలు ఉంటే వారికి సహాయం అందించేందుకు సిద్ధమైంది. ఇందులోభాగంగా ఢిల్లీ తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. సూడాన్లో చిక్కుకున్న తెలంగాణ వారి వివరాల కోసం విదేశాంగ శాఖతో సమన్వయం చేసుకుంటున్నామని ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ (Gaurav Uppal) తెలిపారు.
సూడాన్ చిక్కుకున్న భారతీయులు జెడ్డా నుంచి ఢిల్లీ, ముంబైకి ప్రత్యేక విమానాల్లో తిరిగి వస్తున్నారని చెప్పారు. బుధవారం భారత్కు చేరుకోనున్న వారిలో నలుగురు తెలంగాణకు చెందినవారు ఉన్నట్లు సమాచారం అందిందని వెల్లడించారు. ఢిల్లీ వచ్చే వారికి తెలంగాణ భవన్లో భోజనం, వసతి కల్పిస్తామన్నారు. ఇక్కడినుంచి హైదరాబాద్కు పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన వారిని ఏవిధంగా రాష్ట్రానికి తరలించామో అదే తరహాలో ఢిల్లీలో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.