హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : తిరుమలలోని అన్ని ఉద్యానవనాలకు కొత్త శోభను తీసుకొస్తామని టీటీడీ చైర్మన్ వైబీ సుబ్బారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలిసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గ్రీన్ కార్పెట్, ఎవెన్యూ ప్లాంటేషన్, సీజనల్ ఫ్లవర్స్, 1500 వేలాడే కుండీలను ప్రారంభించారు.
ఈ స్థలంలో 15 అడుగుల కృష్ణ విగ్రహం, 20 అడుగుల పాలరాతి గోవిందనామం, శంఖు, చక్ర చిహ్నాలు, వేంకటేశ్వర పాదాలు, తెల్ల గులాబీలు, మూడు జతల గోమాత, దూడ ఉన్నాయని చైర్మన్ తెలిపారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలనే లక్ష్యంతో ఉద్యానవనాలను ఆధునీకరిస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 27న శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.