వ్యవసాయ యూనివర్సిటీ, జనవరి 23: విజయ ఆయిల్ నుంచి గానుగ వేరుశనగ నూనె అందుబాటులోకి వచ్చిందని తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సమీపంలోని శివరాంపల్లి విజయ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ సమీపంలో రూ.60 లక్షలతో నిర్మించిన నూతన భవనం, వేరుశనగ గానుగను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. దానిలో భాగంగా విజయ ఆయిల్ సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. వినియోగదారుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు గానుగ వేరుశనగ నూనె తయారీకి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. దీని ధర లీటర్కు రూ.280గా నిర్ణయించామని, ఒక లీటర్ నుంచి 15 లీటర్ల డబ్బాల వరకు విక్రయాలు చేపట్టనున్నట్టు తెలిపారు.
విజయ పేరిట వేరుశనగ, దీపపు నూనె, తాగునీరు వంటి 23 రకాల గృహ వినియోగ నిత్యావసర సరుకులను అందుబాటులోకి తెచ్చినట్టు గుర్తుచేశారు. రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తదితర రాష్ర్టాల ప్రజలు విజయ నూనెలకు ప్రాధాన్యం ఇస్తున్నారని వివరించారు. ప్రస్తుతం ప్రతీ నెల 30 వేల మెట్రిక్ టన్నుల విజయ్ ఆయిల్ విక్రయాలు జరుగుతున్నాయని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం సురేందర్ చెప్పారు. గానుగ వేరుశనగ నూనె డిమాండ్ను బట్టి ఉత్పత్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ఆయిల్ ప్యాకింగ్ స్టేషన్ మేనేజర్ కే వెంకటేశ్వర్రెడ్డి వివరించారు. కార్యక్రమంలో జీఎం సుధాకర్రెడ్డి, మేనేజర్లు తిరుమలేశ్వర్రెడ్డి, సత్యనారాయణ, శ్రీకాంత్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి తదితరులు
పాల్గొన్నారు.