జయశంకర్ భూపాలపల్లి : నిషేధిత గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీటీఎఫ్ ఏఈఎస్ తిరుపతి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని నాచారంలో అక్రమంగా సాగు చేస్తున్న 126 గంజాయి మొక్కలను జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్, ఎక్సైజ్ అధికారులతో కలిసి సోమవారం ధ్వంసం చేశారు. గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా డీటీఎఫ్ ఏఈఎస్ తిరుపతి మాట్లాడుతూ.. నిషేధిత గంజాయి సాగు, గుడుంబా, మాదకద్రవ్యాల సరఫరా, విక్రయాలు చేపడితే పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ ప్రశాంతి, ఎస్ఐ రాజన్న తదితరులు ఉన్నారు.