Gangula Kamalaker | హైదరాబాద్ : మహాత్మా జ్యోతిభాపూలే ఆశయాలను ఆచరణాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఆ మహనీయుని 197వ జయంతి వేడుకలను హైదరాబాద్ రవీంద్రభారతిలో నేడు ఘనంగా నిర్వహించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన నిర్వహించిన జయంతి వేడుకల కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండాప్రకాష్, బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ సంఘాల నేతలు, పూలే అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని మహాత్మా జ్యోతిభాపూలేకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. సూర్యచంద్రులున్నంత వరకూ మహాత్మ్యా జ్యోతిభాపూలే, సావిత్రీబాయి పూలేల స్ఫూర్తి వెల్లివిరుస్తుందని, ఆ గొప్పవ్యక్తుల ఆశయ సాధనలో ప్రతీ ఒక్కరు కలిసిరావాలన్నారు. పత్రికలు, సెల్ ఫోన్లు లేని సమయంలోనే వెనుకబడిన వర్గాలపై సమగ్ర అధ్యయనం చేసి వారి అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహనీయుడని, ఎందరో మహనీయులు పుట్టిన పవిత్ర ధాత్రి భారతవనిలో బాబూ జగ్జీవన్ రాం, మహాత్మా జ్యోతిభాపూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహనీయులు జన్మించిన ఏప్రిల్ మాసం మరింత పవిత్రమైనదన్నారు. ఆ గొప్ప వ్యక్తుల ఆశయ సాధనలో తెలంగాణ ముఖ్యమంత్రి విశేష కృషి చేస్తున్నాడని గుర్తు చేశారు. బాబాసాహెబ్ విగ్రహం మాదిరే మహాత్మా జ్యోతిభాపూలే విగ్రహాన్ని ఏర్పాటు కోసం మంత్రులందరం కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ఆసరా ఫించన్లు, కుల వృత్తులకు చేయూత, కళ్యాణలక్ష్మీ, బీసీ ఆత్మగౌరవ భవనాలు వంటి అనేక పథకాల ద్వారా బీసీలకు కేసీఆర్ సర్కార్ అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్తుంటే మరోవైపు బీసీ ప్రధాని అని చెప్పుకొనే కేంద్ర ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తుందని మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. తెలంగాణలో ఏటేటా బీసీ బడ్జెట్ను పెంచుకుంటూ మొన్న రూ. 6,300 కోట్లు కేటాయిస్తే కేంద్రంలో కనీసం బీసీ మంత్రిత్వ శాఖ సైతం లేకుండా రూ. 47 లక్షల కోట్ల బడ్జెట్లో నికరంగా రూ. 2 వేల కోట్లను కూడా బీసీలకు కేటాయించకపోవడం దారుణమైన వివక్ష అన్నారు. మన అకౌంట్లో ఎంతుందో లెక్కలు తీసుకునే ప్రభుత్వం బీసీ లెక్కలను తేల్చకపోవడం అన్యాయం అన్నారు. బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కేంద్రం వెనుకకు నెట్టేస్తుందని, రాజ్యాంగబద్ద వాటా సాధనకోసం కులగణనను సైతం చేయకపోవడం అందుకు నిదర్శనమన్నారు. కేంద్ర వివక్షలపై పోరాడాలని బీసీలకు పిలుపునిచ్చారు మంత్రి గంగుల కమలాకర్.