హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): పౌర సరఫరాల (రేషన్) దుకాణాల్లో తూకం అవకతవకలను అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. తూకంలో గింజ కూడా తక్కువ రాకుండా చూసేలా అన్ని రేషన్ షాపులను డిజిటలైజ్ చేయాలని నిర్ణయించింది. ఈ-పాస్ యంత్రాలతో వేయింగ్ మిషన్లను అనుసంధానించనున్నది. దీంతో వినియోగదారునికి ఇవ్వాల్సిన బియ్యం, ఇతర వస్తువుల తూకం సరిగా ఉంటేనే ఆ ట్రాన్సాక్షన్ పూర్తయ్యి రశీదు వస్తుంది. ఒక్క గ్రాము తక్కువగా ఉన్నా ట్రాన్సాక్షన్ నిలిచిపోతుంది. ఈ విధానాన్ని వచ్చే నెల అమలు చేయనున్నారు. ముందుగా జీహెచ్ఎంసీ పరిధిలోని 1,545 షాపుల్లో కొత్త ఈ-పాస్ మిషన్లను అందించి నూతన విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత జూన్ నెలాఖరు వరకు రాష్ట్రవ్యాప్తంగా విడతలవారీగా అమలు చేస్తారు. మొత్తంగా రాష్ట్రంలోని 17,500 రేషన్ షాపుల్లో బియ్యం తూకానికి సంబంధించి నూతన విధానాన్ని అమలు చేయనున్నారు.
యంత్రాల సరఫరాకు కొత్త కంపెనీ
రేషన్ షాపుల డిజిటలైజేషన్పై పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ-పాస్ మిషన్ల సరఫరా, నిర్వహణకు సంబంధించి ప్రస్తుత కంపెనీ కాలపరిమితి ముగియడంతో కొత్తగా విజన్ టెక్ సంస్థను ఎంపిక చేశారు. ఈ సంస్థ అన్ని రేషన్ షాపులకు కొత్త యంత్రాలను సరఫరా చేయనున్నది. ఈ-పాస్ మిషన్లతో వేయింగ్ మిషన్ల అనుసంధానంతో ఏర్పడే సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని రేషన్ డీలర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సాధారణంగా తమకు సైప్లె చేసే సంచుల్లో సుమారు 2.5 కేజీల వరకు బియ్యం తక్కువగా వస్తాయని తెలిపారు. ఈ నూతన విధానం అమలు వల్ల ప్రతి షాపులో మొత్తం ట్రాన్సాక్షన్లో సుమారు 3-4 క్వింటాళ్ల బియ్యం తక్కువగా వస్తాయని, ఈ భారం తమపై పడకుండా చర్యలు తీసుకోవాలని రేషన్ డీలర్ల సంఘం నేత మురళీమోహన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.