కరీంనగర్, మార్చి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర పునర్విభజన సమయంలో బలవంతంగా ఆంధ్రాలో కలిపిన ఏడు మండలాలను తిరిగి తెస్తారా? అని షర్మిలను బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. శుక్రవారం కరీంనగర్లో గంగుల మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణకు తండ్రిలాంటి కేసీఆర్ ఉన్నారని, కోడలు షర్మిల అవసరం లేదని చురకలంటించారు. పాదయాత్ర చేస్తానంటున్న షర్మిల.. ఆ ఏడు మండలాల నుంచే మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఉన్నంత వరకు తెలంగాణ గడ్డపై పాలనకు మరొకరికి అవకాశం ఉండదని ఉద్ఘాటించారు. అలా కాదని ఎవరైనా కలలు కంటే అవి కలలుగానే మిగిలిపోతాయని.. షర్మిల కూడా ఇదే కోవలోకి వస్తారన్నారు. పట్టభద్రులు, మేధావులు అందరూ టీఆర్ఎస్ వైపు ఉండటం సీఎం కేసీఆర్ చరిష్మా చెక్కు చెదరలేదనడానికి నిదర్శనమని చెప్పారు. సీఎం కేసీఆర్ బొమ్మే తమను గెలిపిస్తుందని గంగుల ధీమా వ్యక్తంచేశారు. ప్రగల్భాలు పలికిన బీజేపీ నల్లగొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగో స్థానానికి పరిమితమైందని ఎద్దేవా చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్ విజయం తథ్యమని, రాబోయే నాగర్జున సాగర్ ఎన్నికలోనూ బ్రహ్మాండమైన మెజార్టీతో విజయం సాధిస్తామని గంగుల కమలాకర్ స్పష్టంచేశారు.