హైదరాబాద్ సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ): ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి రాగి తీగలను అమ్ముకుంటున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను రాచకొండ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 60 కిలోల రాగి కాయిల్స్, వైర్, లక్ష నగదు, కారు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. 173 కేసుల్లో ఏకంగా 306 ట్రాన్స్ఫార్మర్లను ఈ గ్యాంగ్ ధ్వంసం చేసింది. రెండేండ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఈ ముఠాను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ కేసు వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడించారు. రాజేంద్రనగర్లో నివాసముండే ఒడిశాకు చెందిన సహదేవ్ హజిరా, ఉత్తరప్రదేశ్కు చెందిన అభిమన్యు రాజ్బర్, నందులాల్ రాజ్బర్, రాహుల్ రాజ్బర్, రాంచందర్ ముఠాగా ఏర్పడ్డారు. చెడు అలవాట్లకు బానిసలైన వీరు.. ట్రాన్స్ఫార్మర్లలోని రాగి కాయిల్స్, వైరు చోరీచేసి అమ్ముకొనేవారు. దొంగిలించిన సొమ్మును కొనేందుకు కుర్వ చిన్న నర్సింహులు, ఉత్తల్ మహేశ్, మైలార్దేవ్పల్లికి చెందిన తులుగు రమణారెడ్డి, రంజాని యజశ్రీలతో ఒప్పందం చేసుకున్నారు. ఒకటి రెండు దొంగతనాలు చేయగానే, పల్సర్ బైక్, కార్ను కొనుగోలు చేసి అక్కడి నుంచి పక్కా ప్లాన్తో ట్రాన్స్ఫార్మర్లను చోరీచేశారు.
పల్సర్ బైక్పై తిరుగుతూ రెక్కీ..
వ్యవసాయ ప్రాంతాల్లో పల్సర్ బైక్పై ఒకడు వెళ్లి రెక్కీ నిర్వహించేవాడు. ట్రాన్స్ఫార్మర్ వద్ద పరిస్థితులు, దాని కెపాసిటీ, అక్కడకు ఎలా వెళ్లాలి? ఎలా పారిపోవాలనే విషయాలపై ఆరా తీసేవాడు. రాత్రి 12 గంటల తర్వాత ట్రాన్స్ఫార్మర్ వద్దకు ముఠా వెళ్లేది. తమ పరికరాలతో విద్యుత్తు సరఫరాను బంద్ చేసేది. ట్రాన్స్ఫార్మర్లో ఉండే అయిల్ వేడి చల్లారే వరకు ఆగి నూనెను ఖాళీ చేసేది. ఆ తరువాత ట్రాన్స్ఫార్మర్ను విప్పేసి అందులోని కాయిల్స్, రాగి తీగలను, ఇతర పరికరాలను కారులో వేసుకొని ముఠా ఉడాయించేది. ఇలా ఒక్కో ట్రాన్స్ఫార్మర్కు రూ.50 వేల నుంచి లక్ష వరకు ఈ ముఠా సంపాదించేది.
గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురవుతుండటంతో ముఠాను పట్టుకొనేందుకు ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ బృందం ముఠా కోసం గాలిస్తున్నది. ఈ క్రమంలో గురువారం భువనగిరి రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఇండికా కారులో అనుమానాస్పద స్థితిలో వెళ్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ప్రశ్నించడంతో మొత్తం చోరీల గుట్టు బయటపడింది. మొత్తం 173 కేసుల్లో రాచకొండ (62), సైబరాబాద్ (6), వికారాబాద్ (69), సంగారెడ్డి (20), సిద్దిపేట (6) నల్లగొండ (10) కేసుల్లో 306 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి సామగ్రిని ముఠా సభ్యులు అపహరించారు. చోరీ వస్తువులను కొనుగోలు చేసిన నలుగురిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.