హైదరాబాద్ : ట్రాన్స్ఫార్మర్ల నుంచి రాగితీగను దొంగిలించే అంతర్రాష్ట దొంగల(Interstate Thieves) ముఠాను రాచకొండ క్రైమ్ పోలీసులు(Racha konda Crime Police) పట్టుకున్నారు. ఈ ముఠా ఏకంగా రాచకొండ, సైబరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట్ జిల్లాలోని 306 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులో నుంచి రాగి వైర్ను తొలగించి విక్రయించుకున్నారు.
ఈ సందర్భంగా అంతరాష్ట్ర ఘరానా ముఠా వివరాలను శుక్రవారం పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీస్ కమిషనర్(achakonda Police Commissioner) డీఎస్ చౌహాన్ వెల్లడించారు. ఒడిస్సాకు చెందిన సహదేవ్ హజిరా, ఉత్తర్ప్రదేశ్కు చెందిన అభిమన్యు రాజ్బర్, నందులాల్ రాజ్బర్, రాహుల్ రాజ్బర్, రాంచందర్ అనే సభ్యులు రాజేంద్రనగర్ ప్రాంతంలో నివాసముంటూ చెడు అలవాట్లకు బానిసలై దొంగతనాలు చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ట్రాన్స్ఫార్మర్లలోని రాగి కాయిల్స్, వైర్(Copper coils, Wire) అపహరించి అమ్ముకోవాలని నిర్ణయించారు.
ఒకటి రెండు దొంగతనాలు చేయగానే, పల్సర్ బైక్, కార్ను కొనుగోలు చేసి అక్కడి నుంచి పక్కా ఫ్లాన్తో 175 ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్ల(Transformers) పై దాడులు చేశారు. ముందుగా పల్సర్పై తిరుగుతూ రెక్కీ నిర్వహించి దొంగతనాలకు పాల్పడుతున్నారని వివరించారు. రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేసి ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని కాయిల్స్, రాగి తీగలను ఇతర పరికరాలను అపహరించేవారని వెల్లడించారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ నుంచి తీసిన వాటిని రూ. 50 వేల నుంచి రూ. లక్షా వరకు సంపాదిస్తుందని పేర్కొన్నారు.
దొంగిలించిన సొమ్మును కొనేందుకు కుర్వ చిన్న నర్సింహులు, ఉత్తల్ మహేశ్, మైలార్దేవ్పల్లికి చెందిన తులుగు రమణారెడ్డి, రంజాని యజశ్రీలతో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. నిందితులు సహదేవ్ హజిర, అభిమన్యు రాజ్బర్, నందులాల్ రాజ్బర్లతో పాటు రీసీవర్స్ రమణారెడ్డి, జయశ్రీలను అరెస్ట్ చేయగా పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నామని ఆయన తెలిపారు. నిందితుల నుంచి 60 కిలోల రాగి కాయిల్స్, వైర్, రూ. లక్ష నగదు, కారు, బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.