నల్లగొండ జిల్లా వాడపల్లి కేంద్రంగా విక్రయం
38 టన్నుల గుళికలు, రంగు బస్తాలు స్వాధీనం
నీలగిరి, సెప్టెంబర్ 21: నల్లగొండ జిల్లా వాడపల్లి కేంద్రంగా నకిలీ గుళికలు తయారుచేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 38 టన్నుల నకిలీ గుళికలు, రెండు పేమెంట్ మెషీన్లు, బస్తాలు కుట్టే మెషిన్, కాంక్రీట్ మిల్లర్, డీఎంఎఫ్ లిక్విడ్, సింథటిక్ రంగులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ ఏవీ రంగనాథ్ మంగళవారం మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా.. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సింధనూర్కు చెందిన యేలూరి శ్రీనివాస్, అతని స్నేహితుడు కొత్తపల్లి శ్రీనివాస్, హైదరాబాద్కు చెందిన విజయ్శేఖర్ కలిసి ఈ దందాకు తెరలేపారు. అందుకు వాడపల్లి శివారులో అద్దంకి-నార్కట్పల్లి హైవేకు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశాన్ని ఎంచుకున్నారు. నకిలీ గుళికలు తయారుచేసి దామరచర్లలోని ఓ ఎరువుల దుకాణంలో అమ్మేందుకు ప్రయత్నించారు. వీటిపై షాపు యాజమానికి అనుమానమొచ్చి వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అవి నకిలీ గుళికలని తేలింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ ఆటోనగర్లోని విజయ్శేఖర్ గోదాము నుంచి భారీగా నకిలీ గుళికలు స్వాధీనం చేసుకున్నారు. ఇవి 10 ఎకరాల్లో వాడేందుకు సరిపోతాయని ఎస్పీ రంగనాథ్ తెలిపారు.