హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో మత సామరస్యం మరోసారి వెల్లివిరిసింది. గంగా జమున తెహజీబ్ సంస్కృతిని నిలబెట్టుకున్నది. గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ర్యాలీ ఒకే రోజు (ఈ నెల 28న) రావడంతో పోలీసుల సూచన మేరకు ముస్లిం మత పెద్దలు చర్చించుకొని శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ర్యాలీని అక్టోబర్ ఒకటో తేదీకి వాయిదా వేసుకొని అందరి ప్రశంసలు పొందారు.
అందరూ ఈ నిర్ణయానికి కట్టుబడి వచ్చే నెల 1న ర్యాలీ నిర్వహించాలని కోరుతూ మర్కాజి మిలా ద్ జులూస్, హైదరాబాద్ కమిటీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 35 ఏండ్ల తర్వాత వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ 28న ఒకే రోజు వచ్చా యి. ఈ నేపథ్యంలోనే నెల రోజుల ముందు నుంచి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో ఆయా డీసీపీలు క్షేత్ర స్థాయిలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఇరువర్గాలతో చర్చించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత కలహాలకు తావులేకుండా, పటిష్టమైన శాంతి భద్రతలున్నాయి. ఈ సమయంలో ఒకే రోజు రెండు మతాలకు సంబంధించిన భారీ ఎత్తున నిర్వహించే పండుగల ర్యాలీలు నిర్వహించడం వల్ల అనుకోనిదేదైనా జరి గితే హైదరాబాద్కు మచ్చ వస్తుందని అందరు గుర్తించారు. ముస్లిం మత పెద్దలు పెద్ద మనస్సుతో ఒక అడుగు ముందుకు వేసి గంగా జమున తెహాజీబ్లా హైదరాబాద్ ప్రజలు ఎల్లవేళలా కలిసిమెలిసి ఉండాలని భావించారు.
పోలీసులతో చర్చలు, పీస్ కమిటీల్లో చర్చల అనంతరం మిలాద్ ఉన్ నబీ ర్యాలీని మరో మూడు రోజులు వాయిదా వేస్తూ అక్టోబర్ 1వ తేదీ ఆదివారం నిర్వహించేందుకు నిర్ణయించారు. పోలీసుల సూచనలు పాటిస్తూనే, ముస్లిం మత పెద్దలు హైదరాబాద్ అభివృద్ధి, శాంతి సమరస్యాలు నిరంతరం వెల్లివెరిసేలా ఉండేందుకు తీసుకున్న నిర్ణయం పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.