హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): అసత్యాన్ని పదేపదే వల్లిస్తూ పోతే ఏదో ఒకరోజు ప్రజలు సత్యమని అనుకుంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బలంగా నమ్ముతున్నట్టు కనిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం గణేశ్ నిమజ్జనానికి ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని, పైగా నిమజ్జనం సాఫీగా సాగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నదని ఆయన అదేపనిగా ఆరోపించడం చూస్తే ఇది నిజమని నమ్మక తప్పదు. ప్రభుత్వ వైఖరికి నిరసనలు తెలపాలని కూడా పనిలోపనిగా గావుకేకలు వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నిమజ్జనాలు మొదలైనప్పటికీ, మహానిమజ్జనం జరిగే శుక్రవారం సమీస్తున్నప్పటికీ ఎక్కడా ఎలాంటి ఏర్పాట్లేవీ చేయడం లేదని మూడురోజులుగా బండి పెడబొబ్బలు పెడుతున్నారు.
హుసేన్సాగర్ చుట్టూ ఓ చక్కర్ వేసినా లేదా పెద్దఎత్తున నిమజ్జనాలు జరిగే ఏ చెరువును చూసినా నిజమేమిటో తెలుస్తుంది.
జీహెచ్ఎంసీ, పోలీసులతో సహా సంబంధిత ఇతర విభాగాలు ముందే అన్ని చర్యలూ తీసుకున్నాయి. ఏటా నిమజ్జనం జరిగే ట్యాంక్బండ్ నెక్లెస్ రోడ్డుపై, ఇతర నీటివనరుల వద్ద నిమజ్జనం పాయింట్ల గుర్తింపు ఎప్పుడో పూర్తయింది. భారీ విగ్రహాల కోసం క్రేన్లు ముందస్తుగా బుక్ చేసి తెప్పించి సిద్ధంగా ఉంచారు. పోలీసు సిబ్బందిని బందోబస్తుకు నియమించారు. శుక్రవారం జరిగే మహానిమజ్జనం కోసం వివిధ విభాగాల్లో విధులు నిర్వహించే మరింతమంది పోలీసు సిబ్బందిని రప్పిస్తున్నారు. వివిధ ప్రదేశాల్లో మొత్తం 280 క్రేన్లు నిలిపారు. ఒక్క హుసేన్సాగర్ వద్దనే 35 క్రేన్లు ఉన్నాయి. ప్రతి క్రేన్కు సొంత ఆపరేటర్స్ టీమ్, భక్తులకు చేయూత అందించేందుకు ప్రతి నిమజ్జనం పాయింటు వద్ద జీఎచ్ఎంసీ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. పారిశుధ్య నిర్వహణకు, నీటిలో నుంచి విగ్రహాల తొలగింపు, తరలింపునకు జీహెచ్ఎంసీ 10,000 మంది సిబ్బందిని రంగంలోకి దింపింది. వీరు 24 గంటలూ విధులు నిర్వహిస్తున్నారు. ఏదైనా అవాంచనీయ సంఘటన జరిగి అత్యవసర పరిస్థితి తలెత్తితే ఆదుకొనేందుకు 100 మంది గజఈతగాళ్లను మొహరించారు.
కుంటలను సిద్ధం చేసిన యంత్రాంగం
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దంటూ సుప్రీంకోర్టు, హైకోర్టు, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఆదేశాలు జారీచేసిన దృష్ట్యా జీహెచ్ఎంసీ మూడురోజులు కాదు.. నెలరోజులకు పైగా అహోరాత్రులు పనిచేసి కృత్రిమ నిమజ్జనానికి 74 జలాశయాలను సిద్ధం చేసింది. పెద్ద జలాశయాల సమీపంలో ఏర్పాటు చేసిన పిల్ల జలాశయాలు, అవసరమైన చోటికి తరలించేందుకు వీలుండే సంచార జలాశయాలు ఇందులో ఉన్నాయి. ప్రజలు కోరితే ఇండ్ల వద్దకే తీసుకెళ్లేందుకు చిన్నసైజు మొబైల్ జలాశయాలూ చేయించారు. చెరువుల వద్ద పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది. ఇతర ప్రభుత్వ విభాగాల సిబ్బంది ప్రజలకు సాయపడేందుకు సర్వ సన్నద్ధంగా ఉన్నారు. అంతేకాదు అన్ని నిమజ్జనం పాయింట్ల వద్ద పెద్దఎత్తున విద్యుద్దీపాలను అమర్చారు. అన్ని ప్రధాన కేంద్రాల వద్ద వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య సిబ్బందిని నియమించారు. మొబైల్ టాయిలెట్లు, మంచినీటి స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇవన్నీ బండికి ఏర్పాట్లుగా కనిపించకపోతే ఎవరూ ఏమీ చేయలేరు.
అసలు నిజం ఇదీ..
గణేశ నిమజ్జనం సాఫీగా సాగేందుకు కృత్రిమ జలాశయాలు సిద్ధం చేయడంతో సహా ఏ ఒక్కటీ వదిలిపెట్టకుండా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు చేపట్టింది. నగరంలో జరిపిన ఏర్పాట్లను ఒకసారి పరిశీలిద్దాం..