ధర్మపురి, సెప్టెంబర్ 2: జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్లో కాసుల లొల్లి మొదలైంది. నియోజకవర్గంలోని పెగడపల్లికి చెందిన గజ్జెల స్వామి కాంగ్రెస్ టికెట్ తనకేనంటూ శనివారం ధర్మపురి పట్టణంలో ప్రచారం మొదలు పెట్టాడు. ఒక్కొక్కరికి రూ.400 చొప్పున కూలీ ఇస్తానని చెప్పి ఎండపెల్లి నుంచి దాదాపు 30 మంది మహిళలను ప్రచారం కోసం తీసుకొచ్చారు. ధర్మపురికి చేరుకున్న తర్వాత ఆ నాయకుడిపై నమ్మకం కుదరక పట్టణంలోని నందిచౌక్ వద్ద బెంచీలపై కూర్చుండిపోయారు. అక్కడికి ‘నమస్తే’ వెళ్లి మహిళలను పలుకరించగా తమకు రూ.400 ఇస్తామని చెప్పి ప్రచారానికి తీసుకువచ్చారనీ, ఇప్పటివరకు ఇవ్వలేదని చెప్పారు. డబ్బులు ఇస్తేనే ప్రచారంలో పాల్గొంటామని వారు చెప్పడం గమనార్హం. కొద్ది సేపటికి ఓ నాయకుడు వచ్చి సదరు మహిళలకు మాట ఇవ్వడంతో ప్రచారంలో కలిసిపోయారు. ప్రచారం ముగిసిన తర్వాత ఎక్కడివారు అక్కడికి వెళ్లిపోతే తమకు ఇస్తానన్న డబ్బులు ఎవరిని అడగాలని ముందే గట్టిగా తేల్చుకున్నామని మహిళలు అనడం కొసమెరుపు.