యాదాద్రి, అక్టోబర్ 23: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనృసింహుడికి ఆదివారం తెల్లవారుజామున సుప్రభాత సేవను అర్చకులు వైభవంగా జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు తిరువారాధన చేపట్టారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో నిత్య సుదర్శనారసింహ హవనం నిర్వహించారు.
సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు. స్వామి, అమ్మవార్లను పట్టువస్ర్తాలతో అలంకరించి గజవాహన సేవ నిర్వహించారు. సాయంత్రం తిరువీధిసేవ, దర్బార్ సేవ చేపట్టారు. ఆదివారం సెలవురోజు కావడంతో ఆలయ మాడవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు భక్తులతో సందడిగా మారాయి. స్వామివారి ధర్మదర్శనానికి 2 గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తు లు తెలిపారు. 32 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, ఖజానాకు రూ.33,22, 514 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు.