ఎల్బీనగర్, సెప్టెంబర్ 3: సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన యువకుడి కిడ్నాప్ కేసులో పోలీసులు గడ్డిఅన్నారం బీజే పీ కార్పొరేటర్ బద్దం ప్రేంమహేశ్వర్రెడ్డిని ప్రధాన సూత్రధారిగా తేల్చారు. ఆస్తి తగాదాలతోపాటు రాజకీయ వైరం నేపథ్యంలోనే కిడ్నాప్నకు కుట్ర చేసినట్టు వెల్లడించారు. ఈ ఘటనలో15 మంది పాల్గొనగా పది మందిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పీఅండ్టీ కాలనీ సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడు, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ రౌడీషీటర్ లంకా లక్ష్మీనారాయణకు అతని సోదరుడు లంకా మురళికృష్ణకు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేంమహేశ్వర్రెడ్డితోనూ లక్ష్మీనారాయణకు విభేదాలు ఉన్నాయి. కార్పొరేటర్ ప్రధా న అనుచరుడు శ్రావణ్ వ్యక్తిగత విషయంలో నూ లక్ష్మీనారాయణ జోక్యంచేసుకొన్నాడు.
ఈక్రమంలో మురళీకృష్ణ తమ ఆస్తి సమస్య పరిష్కరించాలని కోరుతూ కార్పొరేటర్ అనుచరుడైన శ్రవణ్ను కోరారు. శ్రవణ్ విషయాన్ని కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లాడు. అప్పటికే లక్ష్మీనారాయణపై కోపంతో ఉన్న వీరిద్దరూ దీనిని తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకొన్నారు. లక్ష్మీనారాయణ, అతని కొడుకు సుబ్రహ్మణ్యంను కిడ్నాప్ చేసి బెదిరించాలని పథకం వేశారు. ఇందుకోసం సచివాలయంలోని ఫైనాన్స్ విభాగంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న వనస్థలిపురానికి చెందిన పునీత్ తివారీని ప్రేంమహేశ్వర్రెడ్డి సంప్రదించాడు.
కార్పొరేటర్ ప్రొద్బలంతో పునీత్ 13 మందితో బృందం ఏర్పాటు చేసుకొన్నాడు. సెప్టెంబర్ 1న అర్థరాత్రి పీఅండ్టీ కాలనీలోని గణేశ్ మండపం వద్దకు వచ్చిన పునీత్ బృం దం.. లక్ష్మీనారాయణ కోసం వాకబు చేసింది. లక్ష్మీనారాయణ నిద్రిస్తున్నాడని తెలుసుకొని అతని కొడుకు సుబ్రహ్మణ్యంను కిడ్నాప్ చేశా రు. వెంటనే సుబ్రహ్మణ్యం తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు సెప్టెంబర్ 2న నల్లగొండ జిల్లా చింతపల్లిలో బాధితుడిని రక్షించి, నిందితులను అరెస్టు చేశా రు.
బీజేపీ కార్పొరేటర్ సహా10 మంది అరెస్టు
సుబ్రహ్మణ్యం కిడ్నాప్ కేసులో గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేంమహేశ్వర్రెడ్డి సహా 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పునీత్, పోతబోయిన మంజునాథ్, పాల్పర్తి రవి, కందాల పవన్కుమార్, రావాల హేమంత్, రేవల్లి చంద్రకాంత్, బలివాడ ప్రణీత్, కుంబగిరి కార్తీక్, మోరుపోజు రవి వర్మను అరెస్టు చేశారు. కాగా, శ్రవణ్, లంక మురళి, మహేశ్, మారుతి, సాయికిరణ్ పరారీలో ఉన్నారు.