మానకొండూర్ రూరల్, అక్టోబర్ 28: మానకొండూర్ నియోజకవర్గంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ మానకొండూర్ నియోజకవర్గం ఇన్చార్జి గడ్డం నాగరాజు టికెట్ రాకపోవడంతో నిరాశచెంది కాషాయ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్తోపాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు స్వయంగా మానకొండూర్ మండల కేంద్రంలోని గడ్డం నాగరాజు ఇంటికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసి పార్టీలోకి అహ్వానించారు.
తన ఇంటికి వచ్చిన ఎమ్మెల్యే, జీవీఆర్ను నాగరాజు శాలువాలతో సన్మానించారు. ఎమ్మెల్యే, జీవీఆర్ మాట్లాడుతూ.. నాగరాజు మానకొండూర్ నియోజకవర్గంలో చేసిన సేవలను గుర్తించి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించామని తెలిపారు. నాగరాజు మాట్లాడుతూ.. త్వరలో భారీ సంఖ్యలో తమ అనుచరులతోపాటు మరింత మంది బీజేపీ కార్యకర్తలతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరతానని చెప్పారు.