గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ ఆవిష్కరణ
ఎయిర్ ఐవోటీ పేరిట విద్యార్థుల ప్రత్యేక ప్రాజెక్టు
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 14 : వాయు కాలుష్యంతో మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలు నానాటికీ పెరుగుతున్నాయి. ప్రత్యేకించి పట్టణవాసులను ఈ సమస్య అధికంగా పీడిస్తున్నది. ఈ నేపథ్యంలో గాలి నాణ్యతను పరీక్షించేందుకు గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ (ఐఐఐటీ) విద్యార్థులు ఎయిర్ ఐవోటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) పేరుతో ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టి సరికొత్త యంత్రాన్ని ఆవిష్కరించారు. తొలుత తమ క్యాంపస్లోని 10 ప్రాంతాల్లో.. ఆ తర్వాత గచ్చిబౌలిలోని ట్రాఫిక్ సిగ్నల్స్, పబ్లిక్ గార్డెన్స్, నివాస కాలనీలు సహా 40 బహిరంగ ప్రదేశాల్లో ఈ యంత్రాలను అమర్చి గాలి నాణ్యతకు సంబంధించిన సమాచారాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ విధానంలో సేకరించారు. ఈ సమాచారాన్ని తెలుసుకొనేందుకు ఎయిర్ ఐవోటీ పేరిట మొబైల్ యాప్ను రూపొందించి గూగుల్ ప్లే స్టోర్లో ఉంచారు. దీని సాయంతో గాలి నాణ్యతను, అందులో ఉండే ధూళి కణాల పరిమాణాన్ని తెలుసుకొని, అవసరమైన చర్యలు చేపట్టవచ్చని గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ చౌదరి తెలిపారు.