హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): నిరంతరం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడంలో నిర్లక్ష్యం వహించిన డివిజినల్ ఇంజినీర్ (డీఈ)పై దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బదిలీ వేటు వేశారు. సైబర్ సిటీ సర్కిల్లో డీఈగా విధులు నిర్వర్తిస్తున్న గోపాలకృష్ణను బదిలీ చేశారు. గచ్చిబౌలి డివిజనల్ ఇంజినీర్ (డీఈ ఆపరేషన్స్) విధుల నుంచి తొలగించి ఖైరతాబాద్లోని కార్పొరేట్ కార్యాలయంలో హెచ్ఆర్ విభాగానికి అటాచ్ చేశారు.
కీలకమైన సైబర్ సిటీ సర్కిల్లో గంటల తరబడి ఎల్సీ తీసుకొని, అంతకు మించిన సమయంపాటు విద్యుత్తు సరఫరాను నిలిపివేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన డిస్కం ఉన్నతాధికారులు నివేదికను ఇవ్వడంతో.. సీఎండీ బదిలీ చేశారు. అంతకుముందు సైతం గోపాలకృష్ణపై పలు ఆరోపణలు వచ్చాయి.