సిటీబ్యూరో, జనవరి 26 (నమస్తే తెలంగాణ): విశాఖపట్నంకు చెందిన జి.తిరుమలరావు బెంగళూరులో నివసిస్తున్నాడు. అర్బన్ క్షేత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ (ముంబై), ఆదిత్య హైసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (హైదరాబాద్) సంస్థల నుంచి ఫిబ్రవరి 6, 2018లో షేక్పేటలోని ఆదిత్య టవర్స్ 11వ అంతస్తులోని డీ బ్లాక్లో 1105 ఫ్లాట్ను రూ.99లక్షల 75వేలకు కొనుగోలు చేశారు. ఇందుకు ధరావతు (బయాన) రూ.9 లక్షల 97వేల 500 చెల్లించి, ఒప్పందం చేసుకున్నారు. ఇంతలోనే తన తల్లి మరణించడంతో ఫ్లాట్ను కొనుగోలు చేయలేనని, ఇందుకు ఆర్థిక సమస్యలు కూడా తోడయ్యాయని వ్యతిరేకపక్షాలకు అదేనెల (ఫిబ్రవరి 14న) లేఖ రాశారు. నిబంధనల ప్రకారం అదే నెలలో కొనుగోలును (క్యాన్సిలేషన్) ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంటుందని ఒప్పందంలో పేర్కొన్నారు.
దీంతో వ్యతిరేకపక్షాలు రూ.6లక్షలు ఇస్తామని కొనుగోలుదారుడికి తెలియజేశారు. నిబంధనల ప్రకారం కొనుగోలుదారుడి వెసులుబాటును వ్యతిరేకపక్షాలు నియంత్రించడం తగదని తెలిపారు. అయినా.. స్పందించక పోవడంతో, కొనుగోలుదారుడు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1ను ఆశ్రయించి న్యాయం చేయాల్సిందిగా కోరారు. కమిషన్ అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు సి.లక్ష్మీప్రసన్నలతో కూడిన బెంచ్ కేసు వివరాలను పరిశీలించి, తీర్పును వెలువరించింది. నిబంధనల ప్రకారం రూ.9 లక్షల 97వేల 500లకు కొనుగోలుదారుడికి 2018 నుంచి ఇప్పటి వరకు 6 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని అర్బన్ క్షేత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, ఆదిత్య హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్లను కమిషన్ ఆదేశించింది.