Telangana | హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో ఎంబీబీఎస్, బీహెచ్ఎంఎస్/బీఏఎంఎస్ చేసినవారికి స్థానిక కోటా పరిధిలోనే పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించాల్సి ఉంటుందని హైకోర్టు తేల్చి చెప్పింది. రాష్ట్రం వెలుపల చదివిన, ఇన్సర్వీసు అభ్యర్థులకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అడ్మిషన్లు కల్పించాలని స్పష్టం చేసింది. పీజీ మెడికల్, పీజీ (ఆయుష్) అడ్మిషన్ల నిబంధనలు 2021లోని నిబంధన 8కి సవరణ తీసుకువస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 148, 149లను కొట్టివేస్తూ మంగళవారం 106 పేజీల తీర్పును వెలువరించింది. ప్రభుత్వానికి నిబంధనలు తీసుకురావడంతోపాటు వాటిని సవరించే అధికారం ఉందని, అయితే అది చట్టానికి అనుగుణంగా ఉండాలని పేరొంది. తెలంగాణలో విద్యకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోనే ఉన్నాయని తేల్చి చెప్పింది.
స్థానిక కోటాకు పీజీ మెడికల్, పీజీ (ఆయుష్) అడ్మిషన్లకు సంబంధించి 2021 పీజీ మెడికల్ అడ్మిషన్ల నిబంధన-8కి సవరణ తీసుకువస్తూ ప్రభుత్వం అక్టోబరు 28న తీసుకువచ్చిన జీవో 148, 149లను సవాలు చేస్తూ దాదాపు 98 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించడంగానీ, రద్దు చేయడంగానీ చేయలేదని అందువల్ల అన్వయించుకున్నట్టు భావించాలని ధర్మాసనం పేరొంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 95 నేపథ్యంలో తెలంగాణలో రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించవన్న వాదన అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేసింది. అందువల్ల చదువులకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు తెలంగాణకు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
ప్రభుత్వం జారీచేసిన జీవో 148, 149ల ప్రకారం రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివినంత మాత్రాన స్థానిక కోటా రిజర్వేషన్లకు అర్హులుకాదని హైకోర్టు తెలిపింది. వీటి ప్రకారం ఎంబీబీఎస్లో కూడా స్థానిక కోటా కింద అడ్మిషన్లు పొంది ఉండాలని పేరొంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నాన్లోకల్ క్యాటగిరీలో ఎంబీబీఎస్లో చేరినవారు స్థానిక కోటా కింద పీజీలకు అర్హులు కాదని తెలిపింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పీజీ అడ్మిషన్లు పొందేందుకు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివినవారికే ఎంబీబీఎస్ స్థానిక కోటా కింద అడ్మిషన్లు లభిస్తాయని, అలా ఎంబీబీఎస్లో సీటు పొందినవారికే పీజీ అడ్మిషన్లలో స్థానిక కోటా కింద అర్హత లభిస్తుందని, ఇది చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది.
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నాలుగేండ్లు స్థానికంగా చదువుకున్నవారిని స్థానిక అభ్యర్థిగా పరిగణించాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. ప్రభుత్వ జీవోలు రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమని, అంతేగాకుండా రాష్ట్ర విద్యాసంస్థల నియంత్రణ చట్టంలోని సెక్షన్ 3(2)కు కూడా విరుద్ధమని పేరొంది. పీజీ మెడికల్ కోర్సులకు ఆగస్టు 11న పరీక్ష నిర్వహించగా, ఫలితాలు ఆగస్టు 23న విడుదలయ్యాయి. ప్రభుత్వం అక్టోబరు 28న మెడికల్ అడ్మిషన్లలో స్థానిక కోటా నిబంధనను సవరిస్తూ జీవో జారీచేసింది. ఒకసారి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యాక నిబంధనలను సవరించడం సరికాదని ధర్మాసనం పేరొంది. ఎంబీబీఎస్ అడ్మిషన్ల సమయంలోనూ ప్రక్రియ ప్రారంభమయ్యాక నిబంధనలను సవరించడంపై ఆట మధ్యలో నిబంధనలు మార్చడం సరికాదని ఇదే హైకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తుచేసింది. తెలంగాణలో ఎంబీబీఎస్ చదివినవారికి, ఇతర రాష్ట్రాల్లో చదివినవారికి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానికత వర్తిస్తే వారిని స్థానిక కోటా కిందనే పరిగణించాలని ఆదేశించింది.