హైదరాబాద్, మార్చి 6 : రాష్ట్రంలో ఫర్నిచర్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ డిమాండ్కు తగ్గట్టు స్వీడన్కు చెందిన దిగ్గజ కంపెనీ ఐకియాతోపాటు అనేక జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు హైదరాబాద్లో షోరూమ్లను ఏర్పాటు చేశాయి. రాష్ట్రంలోకి విదేశీ ఫర్నిచర్ కూడా భారీగా దిగుమతి అవుతున్నది. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో ఫర్నిచర్ పార్కు ఏర్పాటుకు టీఎస్ఐఐసీ సన్నాహాలు చేస్తున్నది. దీనికోసం 300 ఎకరాలు అవసరం కాగా.. అచ్చాయిపల్లి, దాచేపల్లి, తునికిబొల్లారం, ములుగు తదితర గ్రామాల పరిధిలో అధికారులు దాదాపు 500 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. ఇందులో టీఎస్ఐఐసీ విజ్ఞప్తి మేరకు అనువైన భూమిని కేటాయించేందుకు జిల్లా కలెక్టర్ భూసేకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నాలుగైదు విదేశీ ఫర్నిచర్ తయారీ సంస్థలు తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. ఇందుకు అవసరమైన స్థలం కోసం టీఎస్ఐఐసీని సంప్రదించాయి. ఫర్నిచర్ పార్కు అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు ఐకియా కూడా ముందుకు రావడంతో టీఎస్ఐఐసీ చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. మరోవైపు, కంటెయినర్ డిపోల ఏర్పాటు, రవాణా, రాయితీలు, ముడి సరుకు లభ్యత తదితర అంశాలపై అధ్యయనం నిర్వహించేందుకు ఏర్పాటైన కన్సల్టెన్సీ ఇటీవలే తన నివేదికను టీఎస్ఐఐసీకి అందజేసింది. రాష్ట్రంలో ఫర్నిచర్ పరిశ్రమ అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు ఆ నివేదికలో పేర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు. ఫర్నీచర్ తయారీ సంస్థలతో త్వరలో సమావేశం నిర్వహించి వారికి అవసరమైన సౌకర్యాలపై చర్చిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఫర్నిచర్ పార్కు ఏర్పాటైతే సామాన్య, మధ్య తరగతి ప్రజలకు నాణ్యమైన ఫర్నిచర్ అందుబాటులోకి రావడంతోపాటు అనేకమందికి ఉపాధి లభిస్తుందని, ఈ పార్కు ద్వారా వచ్చే విదేశీ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని వివరించారు.
పరిస్థితులు అనుకూలం
రాష్ట్రంలో ఫర్నిచర్ పార్కు ఏర్పాటుకు అనువైన పరిస్థితులు, తగిన మార్కెట్ ఉన్నది. ఈ అవకాశాలను అందిపుచ్చుకొని పెరిగిన డిమాండ్కు అనుగుణంగా అత్యాధునిక ఫర్నిచర్ను ఉత్పత్తి చేసేందుకు కృషిచేస్తున్నాం. సిద్దిపేట జిల్లాలో ఫర్నిచర్ పార్క్ ఏర్పాటు కోసం భూసేకరణకు చర్యలు ప్రారంభించాం. ఈ పార్కు ఏర్పాటుతో రాష్ట్ర ప్రజల అవసరాలు తీరడమే కాకుండా ఇతర ప్రాంతాలకు సైతం ఎగుమతులు జరిపేందుకు వీలవుతుంది.
– జయేశ్ రంజన్, రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి