Mallikarjun Kharge | ‘ప్రేమలేఖ రాశా … అది అంది ఉంటది …
అంటూ ఖర్గే తనలో తానే హుషారుగా పాడుకుంటున్నారు.’
‘ఏంటి సార్… ఒక పక్క దేశం మొత్తం మీదా పార్టీ మునిగిపోతుంటే మీరు ఉత్సాహంగా పాటలు పాడుతున్నారు…’ అని తెలంగాణ హస్తం నేత పొట్టయ్య అడిగాడు.
‘రా పొట్టయ్యా… రా..! ఈ వయసులో ప్రేమ లేఖ అంటే రాజకీయాల్లో విజయమే కదా? రాజకీయాల్లో కలకలం సృష్టించే లేఖ రాశా… ఒక్క గుండెలో కదలిక తెస్తే అది ప్రేమ లేఖ … కోట్లాది గుండెల్లో కలకలం సృష్టిస్తే ఆ సంతోషం ఎలా ఉంటుందో తెలుసా? అంటూ ఖర్గే ముసిముసిగా నవ్వాడు.‘రాజకీయాల్లో గెలువాలంటే మనం బలంగా ఉండడమే కాదు, ఎదుటి వాళ్ల బలాలను గుర్తించి వాటిని బలహీనం చేయాలి.’
‘ఎదుటి వాళ్ల బలాలు ఏమిటి సార్?’
‘రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, పెన్షన్, 24 గంటల విద్యుత్… ఇవన్నీ ప్రత్యర్థి బలాలు. మనం గెలవాలి అంటే వీటిపైన యుద్ధం చేయాలి’
‘అర్థం కాలేదు సార్?’
‘తెలంగాణలో మన నేతలందరితో మాట్లాడాను. ఈ పథకాల వల్లే మనం ఓడిపోతున్నాం అని చెప్పారు. అది నిజమే కాబట్టి ఆ పథకాలకే ఎసరు పెడితే మనకు ఎదురు ఉండదు’
‘అవును సార్, ఈ పథకాల లబ్ధిదారులే మన కొంప ముంచేటట్టుగా ఉన్నారు’ ‘రైతుబంధు నిలిపి వేయాలని ఎలక్షన్ కమిషన్కు లేఖ రాశాను. ఇప్పుడు రైతుబంధు రాదు. తరువాత పెన్షన్లపై లేఖ రాస్తాను’
‘సార్ ఇంకో విషయం, 24 గంటల విద్యుత్ అని గొప్పగా చెప్పుకుంటున్నారు. అప్పట్లో కరెంటు కోతలు ఎలా ఉండేవి… ఇప్పుడు ఎలా ఉంది అంటూ దెప్పిపొడుస్తున్నారు. రోజుకు 3 గంటలే విద్యుత్ ఇవ్వాలని ఈసీకి లేఖ రాయండి.. అప్పుడు కానీ ప్రజలు దారికి రారు..’ అని కోపంగా చెప్పాడు.
వీళ్ల మాటలు వింటున్న నాయకుడు నవ్వుకున్నాడు. 1999లో ఉమ్మడి రాష్ట్రంలో దీపం (గ్యాస్ కనెక్షన్) ఆపేయమని ఎన్నికల కమిషన్కు తాను లేఖ రాస్తే ఆ పథకమే తమ పార్టీ దీపాన్ని ఆర్పేసింది గుర్తుకు వచ్చింది అతనికి.
వీళ్లు ఇలా మాట్లాడుకుంటుండగానే హస్తం కార్యకర్తలు పరుగెత్తుకొచ్చారు… ‘సార్ మనం రాసిన లేఖలు లీక్ అయ్యాయ’ని చెప్పారు.
‘లేఖలు సంచలనం సృష్టించాయా?’
‘అవును సార్…గ్రామాల్లోకి వెళితే రైతులు కర్రలు పట్టుకొని మనల్ని ఊరి పొలిమేరకు తరిమి కొడుతున్నారు.’
n మురళి