హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ‘ఉపఎన్నికలు వస్తేనే నిధులొస్తాయి.. నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. దుబ్బాకలో, హుజూరాబాద్లో ఇదే జరిగింది. ఉపఎన్నిక వచ్చినందుకే దళితబంధు పథకం ప్రకటించారు. నిధులు కేటాయించారు. మీ నియోజవకర్గం అభివృద్ధి కావాలంటే మీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమనండి’.. ఇదీ బీజేపీ నేతలు కొంతకాలంగా చేస్తున్న అబద్ధపు ప్రచారం. కానీ ఈ వాదనంతా ఉత్తదేనని మునుగోడు ఉపఎన్నిక ఫలితం తేల్చింది.
టీఆర్ఎస్ ఎలాంటి కొత్త పథకం ప్రకటించకుండానే, శంకుస్థాపనలు చేయకుండానే సునాయాసంగా విజయతీరాలను చేరుకుంది. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించి విజయాన్ని సొంతం చేసుకుంది. తాను రాజీనామా చేయడంతోనే నిధులొచ్చాయని, రోడ్లు వేస్తున్నారని పేర్కొంటూ రాజగోపాల్రెడ్డి చేసిన ప్రచారాన్ని సైతం ఓటర్లు మొదట్లోనే పట్టించుకోలేదు. మొత్తంగా బీజేపీ ప్లాన్ రివర్స్ కాగా.. ఒక్క మునుగోడు విజయంతో టీఆర్ఎస్ ప్రత్యర్థుల నోర్లు మూయించిది.