హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతన్నకు కొండంత భరోసా ఇచ్చిన రైతుబంధు పథకానికి 2023-24 బడ్జెట్లో ప్రభుత్వం నిధులు పుష్కలంగా కేటాయించింది. ఈ ఒక్క పథకానికే రూ.15,075 కోట్లు ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతూ రాష్ర్టానికి నిధులు రాకుండా అడ్డుకొన్నప్పటికీ, వ్యవసాయ విప్లవం ఆగకూడదన్న లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం భారీగా నిధులు ఇచ్చింది. ఈ బడ్జెట్లో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు కలిపి మొత్తం రూ.32,019 కోట్లు కేటాయించింది. రైతుబంధుకు గత ఏడాది రూ.14,800 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.275 కోట్లు పెంచింది. గడిచిన 10 విడతల్లో ప్రభుత్వం రైతుబంధు ద్వారా రూ.65 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది.
సాగుకు చాలినన్ని నిధులు
వ్యవసాయరంగానికి రాష్ట్ర ప్రభుత్వం దన్నుగా నిలిచింది. బడ్జెట్లో ఒక్క వ్యవసాయరంగానికే రూ. 26,831 కోట్లు ప్రతిపాదించింది. ఈ రంగానికి గత ఏడాది రూ.24,254 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, ఈ ఏడాది రూ.2,577 కోట్లు అధికంగా నిధులు ఇచ్చింది. వ్యవసాయ అనుబంధ రంగాలైన పశు సంవర్ధక, మత్స్యశాఖలకు రూ.2,071 కోట్లు, పౌరసరఫరాల శాఖకు రూ. 3,117 కోట్లు కేటాయించింది. పౌరసరఫరాల శాఖకు గత ఏడాది రూ.2,899 కోట్లు కేటాయించగా ఈసారి రూ.218 కోట్లు పెంచింది. మొత్తంగా వ్యవసాయం, అనుబంధరంగాలకు కలిపి రూ.32,019 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించింది. ఈ మొత్తం గత ఏడాది రూ.29,922 కోట్లు. ఈ ఏడాది రూ.2,097 కోట్లు అధికంగా నిధులు ఇచ్చింది. ఇవి కాకుండా పాడి రైతులకు ప్రోత్సాహకం కోసం రూ.75.47 కోట్లు, వ్యవసాయ విద్య, పరిశోధన విద్యకు రూ.40 కోట్లు, విత్తనాల సబ్సిడీకి రూ.39 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ.377.35 కోట్లు, ఉద్యానశాఖకు రూ.856.45 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించింది. చేపల పిల్లల పంపిణీకి రూ.100 కోట్లు కేటాయించింది.
రైతుబీమా.. కుటుంబానికి ధీమా
కారణం ఏదైనా సరే రైతు మరణిస్తే ఆ కుటుంబం అనాథ కాకూడదనే ఉద్దేశంతో ఆ కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ప్రవేశపెట్టిన రైతుబీమా పథకానికి ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ.123 కోట్లు అధికంగా కేటాయించింది. గత ఏడాది రూ.1,465.52 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.1,589.44 కోట్లు ప్రతిపాదించింది. ఈ పథకం కింద ఇప్పటివరకు సుమారు లక్ష మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.5,384 కోట్ల ఆర్థిక సాయం అందించింది.
ఆయిల్పాం రైతుకు అండ
రైతులను ఇతర పంటల సాగువైపు మళ్లించి వారి ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆయిల్పాం సాగును ప్రోత్సహిస్తున్నది. ఆయిల్పాం సాగుకు ముందుకొచ్చే రైతులకు పలు సబ్సిడీలను అందించేందుకు ఈ బడ్జెట్లో ప్రభుత్వం రూ.1000 కోట్లు కేటాయించింది. గత ఏడాది కూడా రూ.వెయ్యి కోట్లు ఇచ్చింది. ప్రభుత్వ సహకారంతో ఆయిల్పాం సాగు జోరుగా సాగుతున్నది. ఇప్పటికే సుమారు 1.50 లక్షల ఎకరాల్లో ఆయిల్పాం సాగైంది.
శాఖల వారీగా కేటాయింపులు (రూ. కోట్లలో)
వ్యవసాయ శాఖ :- 26,831
పశు సంవర్ధక,మత్స్యశాఖ : -2,071
పౌరసరఫరాల శాఖ : – 3,117
మొత్తం : – 32,019
మరికొన్ని విభాగాలకు నిధుల కేటాయింపు ఇలా.. (రూ.కోట్లలో)
వ్యవసాయ యాంత్రీకరణ :- 377.35
విత్తనాల సరఫరా : – 39.25
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ : – 75
కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ : – 17.50
రైతు వేదికలు :- 12
రైతుబంధు సమితి : – 3
మారెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ : – 75.47
వ్యవసాయ విస్తరణ కార్యకలాపాలు :- 1.99
విత్తనాభివృద్ధి సంస్థ : – 25
మైక్రో ఇరిగేషన్ : – 1.25
ఉద్యాన కార్యకలాపాలు :- 7.50
ప్రభుత్వ ఉద్యాన వనాల అభివృద్ధి : – 3.50