పెద్దపల్లి, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంథని(Manthani) కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్యే శ్రీధర్బాబు(Sridhar Babu) ప్రలోభాల పర్వానికి తెరలేపారు. ఓటర్లకు పంచేందుకు తీసుకువస్తున్న శ్రీధర్బాబు ఫొటోతో కూడిన గోడగడియారాలను(wall clocks) ఫ్లయింగ్ స్క్యాడ్స్ అండ్ స్టాటిస్టికల్ బృందం పట్టుకున్నది. సుమారు 1,9600 వేల విలువైన 5368 ప్లాస్టిక్ వాల్ వాచ్లను తరలిస్తున్న డీసీఎం వ్యాన్ను పెద్దపల్లి జిల్లా మంథని పెట్రోల్ బంక్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి స్వాధీనం చేసుకున్నామని ఎఫ్ఎస్టీ బృందం తెలిపింది.
ఈ గడియారాలను హైదరాబాద్ మలక్పేటలోని శ్రీ కృప మార్కెట్లో కొనుగోలు చేసి మంథని నియోజకవర్గంలోని కాటారం రెవెన్యూ డివిజన్లోని చింతకాని ఎక్స్రోడ్లో గల శ్రీ లక్ష్మీ ఏజెన్సీస్ కు శ్రీరామ ట్రాన్స్పోర్ట్ ద్వారా తరలిస్తున్నట్లుగా గుర్తించారు. వీడియో, ఫొటో షూట్ చేసిన అనంతరం మంథని పోలీసు స్టేషన్కు తరలించారు. ఎఫ్ఎస్టీ బృందం ఇన్చార్జి ఫిర్యాదు మేరకు మంథని పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.