వరంగల్ అర్బన్ : ఫేస్బుక్ స్నేహితులంతా కలిసి బ్లడ్ క్యాన్సర్ రోగికి రూ.1.03 లక్షలు ఆర్థికసాయం అందించారు. హన్మకొండకు చెందిన ల్యుకేమియా రోగి గంగాధారి జ్యోతి(38). ఈమె భర్త ప్రైవేటు టీచర్. పాఠశాలలు బంద్ ఉండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్న కాస్త భూమి కూడా ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం అమ్ముకున్నారు. జ్యోతి పరిస్థితి తెలిసిన జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణానికి చెందిన సామాజికవేత్త రేణికుంట రమేష్ ఫేస్బుక్ ద్వారా విరాళాలు అర్థించాడు. దీంతో అతని స్నేహితులు స్పందించి రూ.1.03 లక్షలు ఆమె భర్త బ్యాంకు అకౌంట్లో జమ చేశారు.
రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. జ్యోతి పరిస్థితి గురించి తెలిసిన తర్వాత విరాళాలు కోరుతూ ఏప్రిల్ 4న ఎఫ్బీలో ఓ మేసేజ్ పోస్ట్ చేశా. స్పందించిన నా ఎన్ఆర్ఐ స్నేహితులు, కర్ణాటకలోని బెళ్లారికి చెందిన స్నేహితులు సాయం చేశారు. దాతలచేతనే నగదును రోగి భర్త బ్యాంక్ అకౌంట్లో జమ చేయించినట్లు తెలిపారు. 2015 నుండి ఇప్పటివరకు తాను రూ. కోటి విరాళంగా సేకరించినట్లు తెలిపాడు. దాదాపు 85 కుటుంబాలను ఆదుకున్నట్లు వెల్లడించాడు. ఇతని ఎన్ఆర్ఐ స్నేహితులంతా అమెరికా, ఆస్ట్రేలియాలో ఉంటారు.