Freedom Run | ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుందని ఉత్సవాల కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు అన్నారు. వజ్రోత్సవాల సందర్భంగా శనివారం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో.. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి ట్యాంక్ బండ్పైనున్న వివేకానంద విగ్రహం వరకు ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించారు. జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది, ఎంటమాలజి, డీఆర్ఎఫ్ బృందాలు, ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బందితో పాటుగా స్వయం సహాయక బృందాలు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు, పోలీస్ సిబ్బంది వేలాది మంది జాతీయ జెండాను చేతబూని.. భారత్ మాతాకు జై అని నినదీస్తూ ర్యాలీలో పాల్గొని.. దేశ ఔన్నత్యాన్ని చాటారు.
కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ సోమేశ్కుమార్, అడిషనల్ డీజీ జితేందర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ లోకేశ్కుమార్, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్సీలు వాణీదేవి, ఎంఎస్ ప్రభాకర్రావు, యెగ్గే మల్లేశం, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం బెలూన్లను ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు మంచి స్పందన వస్తుందన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఆనాటి పోరాట స్ఫూర్తి, త్యాగాలను స్మరించుకుంటూ ముందుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో వజ్రోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సీఎస్ సోమేశ్కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీడమ్ ర్యాలీలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, స్వాతంత్య్ర స్ఫూర్తిని పెంపొందించేందుకు చేపడుతున్న కార్యక్రమాల్లో అంతా ఆనందోత్సాహాలతో పాల్గొంటున్నారన్నారు.
ఈ నెల 16న ఉదయం 11.30 గంటలకు ఎక్కడివారక్కడ ఆగి జాతీయ గీతాలాపన చేయాలని కోరారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వజ్రోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున అందరూ పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లు శృతిఓజా, బీ సంతోష్, అడిషనల్ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్, కృష్ణ, జయరాజ్ కెనడీ, సరోజ, విజయలక్ష్మి, యాదగిరి రావు, ఈఎన్సీ జియావుద్దీన్, సీఈ దేవానంద్, సీపీపీ దేవేందర్ రెడ్డి, ఓఎస్డీ సురేష్ కుమార్, చీఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్ రెడ్డి, అడిషనల్ సీసీపీ శ్రీనివాస్, జోనల్ కమిషనర్లు శంకరయ్య, రవికిరణ్, శ్రీనివాస్ రెడ్డి, చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ రాంబాబు, సీఎంహెచ్ఓ డాక్టర్ పద్మజ, జాయింట్ కమిషనర్ సంధ్య, సెక్రెటరీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.