హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. ఈ నెల 10వ తేదీన ఫ్రీడం ప్లాంటేషన్ కార్యక్రమం చేపట్టాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్ఎం డోబ్రియల్ సూచించారు. తెలంగాణకు హరితహారం ఎనిమిదవ విడత పురోగతిపై అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయితీ రాజ్, ఇరిగేషన్, అటవీ శాఖ అధికారులతో పీసీసీఎఫ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లాల వారీగా హరితహారం టార్గెట్లు, ఇప్పటిదాకా సాధించిన ప్రగతిపై ఆరా తీశారు. హరితహారంపై అన్ని శాఖల సమన్వయం చేస్తున్న అదనపు కలెక్టర్లు ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించాలని కోరారు. కొన్ని జిల్లాల్లో మొక్కల పంపిణీని పెద్ద సంఖ్యలో చూపుతున్నారని, కానీ గృహాలకు పంపిణీ చేసిన మొక్కలు తప్పనిసరిగా నాటేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.