హైదరాబాద్, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 15న పుట్టబోయేవారికి పన్నేండ్లపాటు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తామని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, వైస్చైర్మన్, ఎండీ సజ్జనార్ తెలిపారు. 75 ఏండ్లు నిండినవారికి పంద్రాగస్టునాడు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. ఆగస్టు 9 నుంచి 21 వరకు ‘వీల్స్ ఆన్ ఫ్రీడం-టేకింగ్ తెలంగాణ ఫార్వ ర్డ్’ పేరుతో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని బస్టాండ్లలో ఈ నెల 13 నుంచి 15 వరకు జాతీయ జెండాలు ఎగరేయడంతో పాటు, ఆగస్టు 9 నుంచి 21 వరకు ఉదయం 11 గంటలకు జాతీయ గీతాలాపన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్ బస్టాండ్ల్లో 32 మంది స్వాతంత్య్ర పోరాటయోధుల చరిత్రను తెలిపే స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఆగస్టు 13న హైదరాబాద్ నెక్లెస్రోడ్డులో పాత, ప్రస్తుత బస్సులతో ఆర్టీసీ పరేడ్ నిర్వహించనున్నారు. ఆగస్టు 18న రాష్ట్రవ్యాప్తంగా 75 చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించి 7,500 యూనిట్ల రక్తం సేకరించాలని నిర్ణయించామన్నారు.
టీఎస్ఆర్టీసీ ఆఫర్లు ఇవే..
75 ఏండ్లు నిండిన వారికి ఆగస్టు 15న అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం.
రూ.120 ఉన్న టీ-24 టికెట్లను రూ.75కే ఇస్తారు.
ఆగస్టు 15న పుట్టే పిల్లలకు పన్నేండ్లు వచ్చే వరకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం.
ఆగస్టు 16 నుంచి 21 వరకు టీటీడీ ప్యాకేజీలపై రూ.75 రాయితీ ఇస్తారు.
1 కిలో లోపు బరువు ఉన్న కార్గో పార్సిళ్లపై ఆగస్టు 15న 75 కిలోమీటర్ల వరకు ఎలాంటి చార్జీలు వసూలు చేయరు.
నిత్యం ఆర్టీసీలో దూర ప్రయాణాలు చేసే 75 మందిని గుర్తించి వారి తదుపరి ట్రిప్నకు ఫ్రీ టికెట్ ఇస్తారు.
పుష్పక్ ఎయిర్పోర్ట్ సర్వీస్ బస్సుల్లో ప్రయాణించేవారు టికెట్ ధరలో 75% చెల్లిస్తే సరిపోతుంది.
ఆగస్టు 15 నుంచి 22 వరకు 75 ఏండ్లు దాటిన వృద్ధులకు తార్నాక ఆర్టీసీ దవాఖానలో ఉచిత మెడికల్ చెకప్తో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. 75 ఏండ్లలోపు వారికి రూ.750 మెడికల్ చెకప్ ప్యాకేజీతో పాటు మందులపై 75% రాయితీ ఇస్తారు.