Free Bus For Women | హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రత్యేక ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు బస్సులను ఏర్పాటు చేస్తామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ ప్రత్యేక బస్సుల్లోనూ మహిళల ఉచిత ప్రయాణానికి అనుమతి ఉంటుందని ఆయన తెలిపారు. హైదరాబాద్ బస్భవన్లో అద్దె బస్సుల యజమాన్యాల సంఘంతో టీఎస్ఆర్టీసీ యాజమాన్యం గురువారం సమావేశమై చర్చలు జరిపింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ చర్చల అనంతరం అద్దె బస్సుల నిర్వహణపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి, ఆ సిఫారసులను పరిశీలించాక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
మహిళల ఉచిత బస్సు ప్రయాణంతో రద్దీ పెరిగి బస్సులు పాడవుతున్నాయని, ప్రమాదాలకు ఆస్కారం ఉన్నదని అద్దె బస్సుల యాజమాన్య సంఘం తెలపడంతో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిపై అద్దె బస్సుల యజమాన్య సంఘం సానుకూలంగా స్పందించిందని, శుక్రవారం నుంచి అద్దె బస్సులు యథావిధిగా నడుస్తాయని ఎండీ వివరించారు. సమావేశంలో ఆర్టీసీ సీవోవో రవీందర్, ఈడీలు మునిశేఖర్, కృష్ణకాంత్, వినోద్కుమార్ పాల్గొన్నారు.