సుల్తాన్బజార్, జూన్ 25: ఎముకలు అరిగి, మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న పేదలకు హైదరాబాద్లోని ఉస్మానియా దవాఖాన వరంగా మారుతున్నది. కార్పొరేట్ దవాఖానల్లో రూ.5 లక్షల ఖరీదైన శస్త్రచికిత్సలను ఇక్కడ ఉచితంగా చేస్తుండటంతో మోకాలు నొప్పి బాధితులు క్యూ కడుతున్నారు. ఒకేరోజు ఆరుగురికి మోకాలు కీళ్ల మార్పిడి, తుంటి మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్టు దవాఖాన సూపరింటెండెంట్ నాగేందర్ అధిపతి డాక్టర్ రమేశ్ తెలిపారు.
శనివారం దవాఖాన ఆడిటోరియంలో డాక్టర్ నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ.. ఉస్మానియా దవాఖాన పట్ల ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించేందుకు అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఇటీవల జనగామ, ఘట్కేసర్, ఆలేరు, గోల్కొండ ప్రాంతాల్లో వైద్యశిబిరాలను నిర్వహించి, వంద మందికి ఎముకలు అరిగినట్టు గుర్తించామని తెలిపారు. వీరిలో అత్యవసర చికిత్స అవసరమైన ఐదుగురికి మోకాలు కీళ్లు, మరొకరికి తుంటి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించినట్టు వెల్లడించారు. త్వరలోనే మరో 25 మందికి శస్త్రచికిత్సలు చేస్తామని చెప్పారు.
ఎముకల అరుగుదల సమస్యతో బాధపడుతున్న రోగులకు ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకంలో ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహించినట్టు తెలిపారు. పేదలకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఉస్మానియా దవాఖానకు అత్యాధునిక యంత్రాలను సమకూర్చడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ రమేశ్ మాట్లాడుతూ పేదలు కార్పొరేట్ దవాఖానలకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోకుండా ఉస్మానియా సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
మోకాలి కీళ్ల మార్పిడి చేయించుకొన్న రోగులు మాట్లాడుతూ.. గతంలో ఉస్మానియాకు రావాలంటేనే భయపడేవాళ్లమని, ఇప్పడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. తమకు ఉచితంగానే ఆపరేషన్లు చేశారని తెలిపారు. సమావేశంలో ఉస్మానియా దవాఖాన అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ త్రివేణి, డాక్టర్ శేషాద్రి, డాక్టర్ టీ సాయిశోభ, డాక్టర్ బీ శ్రీనివాసులు, డాక్టర్ అనూరాధ, డాక్టర్ పీ సుష్మ, డాక్టర్ కవిత, డాక్టర్ రఫీ, డాక్టర్ జాఫర్హష్మీ, ఆర్థోపెడిక్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ ఆదిత్య, డాక్టర్ శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.