Telegram | హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): కొత్తగా రిలీజ్ అయిన సినిమా, వెబ్ సిరీస్ చూడాలంటే వెంటనే టెలిగ్రామ్ను ఆశ్రయిస్తున్నవారికి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సైబర్ దోస్త్ హెచ్చరికలు జారీ చేసింది. చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవగానే సబ్స్క్రిప్షన్ లేకపోయినా వెంటనే టెలిగ్రామ్లోని పలు గ్రూపుల్లో ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో చాలామంది ఈ ఫ్రాడ్ గ్రూపుల గురించి తెలియక.. కొత్త సినిమాల మోజులో టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరుతున్నారు.
దీంతో ఐబొమ్మ, టెలిగ్రామ్ వంటి వాటిల్లో కొత్త సినిమాలకు థంబ్నైల్స్ పెట్టి.. సైబర్ లింకులను అటాచ్ చేస్తున్నారు. ఆ లింక్స్ ఓపెన్ చేయగానే సైబర్ నేరగాళ్లకు మన సమాచారం వెళ్తుంది. దీంతో వారు సులువుగా ట్రాప్ చేసి, డబ్బులు వసూలు చేస్తున్నట్టు సైబర్ దోస్త్ గుర్తించింది. ఈ తరహా మోసాలు టెలిగ్రామ్ యాప్లో భారీగా జరుగుతున్నట్టు తెలిపింది. తెలియని లింక్లను ఓపెన్ చేసి, డబ్బులు పోగొట్టుకోవద్దని సూచిస్తున్నది. టెలిగ్రామ్ ద్వారా ఇచ్చే లింక్ల నుంచి ఎలాంటి యాప్స్ను డౌన్లోడ్ చేసుకోవద్దని పేర్కొంటున్నది.